ఆరుగురు ఉద్యోగులు.. ఆరు బీఏలపై వేటు

ఆరుగురు ఉద్యోగులు.. ఆరు బీఏలపై వేటు
  • టీసీఎస్​ ఏజీఎంలో  చైర్మన్​ చంద్రశేఖరన్​

ముంబై: జాబ్స్​ స్కామ్​పై దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఇప్పటికే  ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని, ఆరు బిజినెస్​ అసోసియేట్స్​పై వేటు వేశామని టీసీఎస్​ చైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​ కంపెనీ ఏజీఎంలో గురువారం వెల్లడించారు. కంపెనీలోని కొంత మంది  లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నట్లు  ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక సీనియర్​ ఆఫీసర్​ బయటకు వచ్చి ఈ స్కామ్​పై మాట్లాడటం ఇదే మొదటిసారి. దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చింది, ఏం చేయబోతున్నామనే అంశం మీదా చంద్రశేఖరన్​ ఏజీఎంలో వివరించారు. ఆరుగురు ఉద్యోగులు అనైతిక ప్రవర్తనకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించామని, కాకపోతే వారు ఏమేరకు ప్రయోజనాలు పొందారనేది నిర్ధారించలేమని పేర్కొన్నారు. కొన్ని రిక్రూట్​మెంట్​ సంస్థలకు ఆ ఉద్యోగులు అక్రమంగా సాయపడుతున్నట్లు తేలిందని చెప్పారు.  

మరో ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇలా అనైతికంగా ప్రవర్తించే ఉద్యోగులను ఉపేక్షించమని, సీరియస్ ​యాక్షన్​ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇద్దరు విజిల్​ బ్లోయర్లు కంపెనీ రిక్రూట్​మెంట్లో అవకతవకలు జరుగుతున్న విషయంపై ఎత్తి చూపించినట్లు చంద్రశేఖరన్​ చెప్పారు. దాదాపు 1,000కి పైగా బిజినెస్​ అసోసియేట్స్​(బీఏ) సంస్థలతో టీసీఎస్​ కలిసి పనిచేస్తోందని, 55 దేశాలలో ఉద్యోగులు కావల్సి ఉండటంతో ఇలా కలిసి పనిచేయడం తప్పనిసరని పేర్కొన్నారు. కంపెనీ సీనియర్​ ఆఫీసర్లు ఎవరికీ ఈ జాబ్స్​ స్కామ్​లో ప్రమేయం లేదని, అలాగే కంపెనీపై ఆర్థికపరమైన ప్రభావం కూడా ఏమీ ఉండదని స్కామ్ ​వార్తలపై టీసీఎస్​ ఇంతకు ముందే స్పందించింది.