
- టీసీఎస్ ఏజీఎంలో చైర్మన్ చంద్రశేఖరన్
ముంబై: జాబ్స్ స్కామ్పై దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఇప్పటికే ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించామని, ఆరు బిజినెస్ అసోసియేట్స్పై వేటు వేశామని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కంపెనీ ఏజీఎంలో గురువారం వెల్లడించారు. కంపెనీలోని కొంత మంది లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒక సీనియర్ ఆఫీసర్ బయటకు వచ్చి ఈ స్కామ్పై మాట్లాడటం ఇదే మొదటిసారి. దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చింది, ఏం చేయబోతున్నామనే అంశం మీదా చంద్రశేఖరన్ ఏజీఎంలో వివరించారు. ఆరుగురు ఉద్యోగులు అనైతిక ప్రవర్తనకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించామని, కాకపోతే వారు ఏమేరకు ప్రయోజనాలు పొందారనేది నిర్ధారించలేమని పేర్కొన్నారు. కొన్ని రిక్రూట్మెంట్ సంస్థలకు ఆ ఉద్యోగులు అక్రమంగా సాయపడుతున్నట్లు తేలిందని చెప్పారు.
మరో ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇలా అనైతికంగా ప్రవర్తించే ఉద్యోగులను ఉపేక్షించమని, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇద్దరు విజిల్ బ్లోయర్లు కంపెనీ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరుగుతున్న విషయంపై ఎత్తి చూపించినట్లు చంద్రశేఖరన్ చెప్పారు. దాదాపు 1,000కి పైగా బిజినెస్ అసోసియేట్స్(బీఏ) సంస్థలతో టీసీఎస్ కలిసి పనిచేస్తోందని, 55 దేశాలలో ఉద్యోగులు కావల్సి ఉండటంతో ఇలా కలిసి పనిచేయడం తప్పనిసరని పేర్కొన్నారు. కంపెనీ సీనియర్ ఆఫీసర్లు ఎవరికీ ఈ జాబ్స్ స్కామ్లో ప్రమేయం లేదని, అలాగే కంపెనీపై ఆర్థికపరమైన ప్రభావం కూడా ఏమీ ఉండదని స్కామ్ వార్తలపై టీసీఎస్ ఇంతకు ముందే స్పందించింది.