భార్య కేసు పెట్టిందని..మనస్తాపంతో ఐటీ ఉద్యోగి సూసైడ్

భార్య కేసు పెట్టిందని..మనస్తాపంతో ఐటీ ఉద్యోగి సూసైడ్

పద్మారావునగర్, వెలుగు: భార్య తనపై కేసు పెట్టిందని మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కృష్ణానగర్ కాలనీకి చెందిన విశాల్ గౌడ్(28) టీసీఎస్‌‌లో ఉద్యోగం చేస్తున్నాడు. 2023 డిసెంబర్‌‌లో నవ్య అనే యువతితో వివాహమైంది. 

కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మార్చిలో నవ్య తన పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. రెండు నెలల క్రితం ఉప్పల్ పోలీస్​ స్టేషన్​లో ఆమె కేసు పెట్టడంతో పోలీసులు విశాల్‌‌ను పిలిచి కౌన్సెలింగ్​ ఇచ్చారు. 

ఆ తరువాత కేసు నమోదైందని, స్టేషన్‌‌కు రావాలని ఉప్పల్ పోలీసులు ఫోన్ చేశారు. దీంతో ఒత్తిడికి గురైన విశాల్ రెండు రోజులుగా డిప్రెషన్‌‌లోకి వెళ్లిపోయాడు. శుక్రవారం తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు మృతికి కోడలే కారణమని మృతుడి తండ్రి శ్రీనివాస్​గౌడ్​ ఫిర్యాదు చేశాడు.

సూపర్​మార్కెట్​ సూపర్​వైజర్..

కూకట్​పల్లి : ఓ ఆన్​లైన్​ సూపర్​మార్కెట్​లో సూపర్​వైజర్​గా పని చేస్తున్న యువకుడు సూసైడ్​ చేసుకున్నాడు. జార్ఖండ్​ రాష్ట్రానికి చెందిన బినయ్​కుమార్(27) కొంతకాలంగా బాలాజీనగర్​లోని భూమి నేచురల్స్ ఆన్​లైన్​ సూపర్​మార్కెట్​లో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి ఎవరూ లేని సమయంలో అదే మార్కెట్​లో ఫ్యాన్​కు ఉరేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. ఈయన కొన్ని రోజులుగా డిప్రెషన్​లో ఉంటున్నాడు.