అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

అమరావతి రాజధానిపై చంద్రబాబు ట్వీట్

విజయవాడ: ఏపీ రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. కనీసం వెయ్యేళ్ల పాటు తెలుగుజాతి గుండె చప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. అయితే పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రాజధాని అమరావతి 28 వేల మంది రైతుల త్యాగఫలమని.. కోట్ల మంది సంకల్పం అని చంద్రబాబు అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని.. ఎన్నికల ముందు అమరావతి రాజధానిగా  స్వాగతించిన వ్యక్తి... అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. 

అమరావతి రైతుల మహాపాదయాత్రపై కుతంత్రాలు సాగవు

అమరావతి రైతుల మహా పాదయాత్రపై అధికార వైసీపీ పార్టీ కుతంత్రాలు సాగవని చంద్రబాబు  ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఆంధ్రుల రాజధాని అమరావతే.. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది.. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది... నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది.... అమరావతే గెలుస్తుంది...ఇదే ఫైనల్...’’ అని చంద్రబాబు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.