
టీచర్లు, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో ) ఉద్యమ కార్యచరణను ప్రకటించింది. ఆగస్టు 20న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నామనీ, సెప్టెంబర్ 1న హైదరాబాద్లో ఉపాధ్యాయ గర్జన చేపడతామని జాక్టో స్టీరింగ్ కమిటీ నేతలు భుజంగరావు, రఘునందన్ తెలిపారు. ఆదివారం ఎస్టీయూటీఎస్ కార్యాలయంలో జాక్టో సమావేశం జరిగింది. ఈ సందర్భగా భుజంగరావు, రఘునందన్ మాట్లాడుతూ… నాలుగేండ్లుగా టీచర్లకు పదోన్నతులు లేవని, చాలా మంది ప్రమోషన్లు పొందకుండానే రిటైర్ అవుతున్నారని తెలిపారు. సబ్జెక్టు టీచర్లు, గజిటెడ్ హెడ్మాస్టర్ల పోస్టులు వేలాదిగా ఖాళీగా ఉన్నాయని, ఈ ప్రభావం విద్యాప్రమాణాలపై పడుతోందని పేర్కొన్నారు. టీఆర్టీ-2017 నియామకాలు కూడా పూర్తిచేయడం లేదన్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఎంప్లాయీస్కు ఐఆర్, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాక్టో సీరింగ్ కమిటీ సభ్యులు సదానందంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.