సెక్రటేరియట్​ కేంద్రంగా అడ్డదారిలో టీచర్ల బదిలీలు

సెక్రటేరియట్​ కేంద్రంగా అడ్డదారిలో టీచర్ల బదిలీలు

టీచర్​ యూనియన్స్​ ఆరోపణ

హైదరాబాద్‌‌, వెలుగు: టీచర్ల అంతర్​ జిల్లాల బదిలీలు అడ్డదారిలో జరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా ఈ బదిలీలు చేపట్టాలని ఏండ్ల నుంచి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, అక్రమంగా మాత్రం జరిగిపోతూనే ఉన్నాయని టీచర్​ యూనియన్స్​ మండిపడుతున్నాయి.  ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారిగా టీచర్ల అంతర్‌‌ జిల్లా బదిలీలు జరిగాయి. అటు తర్వాత ఇప్పటివరకు అధికారికంగా వాటిని నిర్వహించడం లేదు. దీంతో చాలా మంది టీచర్లు బదిలీల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అధికారికంగా జరగకపోవడంతో కొందరు టీచర్లు అడ్డదారిలో అంతర్​ జిల్లా బదిలీలు చేయించుకుంటున్నారు.

గతేడాది సెక్రటేరియట్‌‌ కేంద్రంగా 200 మంది టీచర్ల బదిలీలు జరిగినట్లు యూనియన్​ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి మేడ్చల్‌‌, రంగారెడ్డి జిల్లాల్లోకి 24 మంది టీచర్లు  బదిలీపై వచ్చినట్లు చెప్తున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం సీఎంవో  సిఫారసుల మేరకు విద్యాశాఖ కార్యదర్శి 15 మంది టీచర్లను బదిలీ చేసినట్లు టీచర్​ యూనియన్స్​ ఆరోపిస్తున్నాయి. ఇందులో నిర్మల్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు, కొత్తగూడెం నుంచి రంగారెడ్డికి, జగిత్యాల నుంచి కరీంనగర్ కు అంతర్​జిల్లా బదిలీలు జరిగాయని అంటున్నారు. ఇంకా ఇలా ఎందరో టీచర్లు అడ్డదారిలో బదిలీలు చేసుకుంటున్నారని, ఇందుకోసం పెద్ద ఎత్తున పైరవీలు జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందల సంఖ్యలో బదిలీల దరఖాస్తులు సెక్రటేరియేట్‌‌లో పెండింగ్‌‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొందరు టీచర్ల అంతర్ రాష్ట్ర బదిలీలు జరగ్గా, ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం అధికారికంగా షెడ్యూల్​ విడుదల చేసి అంతర్​ జిల్లాల బదిలీలు చేపట్టాలని టీచర్​​ యూనియన్స్​ డిమాండ్​ చేస్తున్నాయి.

టీచర్ల పైరవీ బదిలీలు ఆపాలి: యూఎస్‌‌పీసీ

అడ్డదారుల్లో టీచర్ల అంతర్​ జిల్లా బదిలీలు జరుగుతున్నాయని, అలాంటి బదిలీలను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌‌పీసీ) డిమాండ్‌‌ చేసింది. పైరవీ బదిలీలను నిలిపివేసి, అధికారికంగా చేపట్టాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌‌రెడ్డికి యూఎస్‌‌పీసీ నేతలు చావ రవి(యూటీఎఫ్‌‌), అశోక్‌‌కుమార్‌‌, మైస శ్రీనివాస్‌‌ (టీపీటీఎఫ్‌‌), రఘుశంకర్‌‌రెడ్డి, టి.లింగారెడ్డి(డీటీఎఫ్‌‌) తదితరులు వినతిపత్రం అందజేశారు. నాలుగైదు వందల మంది టీచర్లు అంతర్‌‌ జిల్లాల బదిలీల కోసం ఐదారేండ్ల నుంచి మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని,  దొడ్డిదారిన మాత్రం అవి జరిగిపోతున్నాయని ఆరోపించారు.

అక్రమ బదిలీలు సరికాదు: ఎస్​టీయూటీఎస్

నిబంధనలను తుంగలో తొక్కి సీఎంవో నుంచే అక్రమ బదిలీలకు తెరతీయడం సరికాదని ఎస్‌‌టీయూటీఎస్‌‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.భుజంగరావు, సదానందంగౌడ్ అన్నారు. ఇప్పటికే 500 మంది టీచర్లు అంతర్‌‌ జిల్లా బదిలీ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇప్పటిదాకా చేసిన అక్రమ బదిలీలను రద్దు చేయాలని, అంతర్‌‌ జిల్లాల బదిలీల షెడ్యూల్‌‌ ప్రకటించాలని డిమాండ్‌‌ చేశారు. టీటీఎఫ్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్‌‌ కూడా ఇదే డిమాండ్​ చేశారు.