- అద్భుతం చేయాలె ..
- వరల్డ్ కప్ గెలవడంపైనే దృష్టి పెట్టామన్న రోహిత్ శర్మ
- మంచైనా, చెడైనా బయటి మాటలను పట్టించుకోం
- గత వరల్డ్ కప్కు ముందున్న ఫామ్ను కొనసాగిస్తా
న్యూఢిల్లీ : 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇండియా టీమ్ మళ్లీ ఇంతవరకు ఐసీసీ ట్రోఫీ నెగ్గలేదు. కారణాలేమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా చాలాసార్లు మెగా ట్రోఫీకి దగ్గరగా వచ్చి ఓడిన రోజులు చాలా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం అలాంటి తప్పు జరగకుండా ఏదో ఓ అద్భుతం సృష్టించాలని కోరుకుంటున్నట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. రాబోయే రెండు నెలల్లో ఈ టీమ్తో మధుర జ్ఞాపకాలను క్రియేట్ చేస్తానని వెల్లడించాడు. సోమవారం ఆసియా కప్ టీమ్తో చేరే ముందు హిట్మ్యాన్ మీడియాతో మాట్లాడాడు.
‘మేం ఐసీసీ ట్రోఫీ గెలవక దశాబ్దం దాటింది. ఆ ఒత్తిడి మాపై ఉన్నా ప్రస్తుతానికి అవేమీ పట్టించుకునే స్థితిలో లేం. నా వరకైతే నేను చాలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. పాజిటివ్స్, నెగెటివ్స్ ఎవరు ఏం మాట్లాడినా వాటిని కూడా పట్టించుకోబోం. మా దృష్టంతా వరల్డ్ కప్పైనే కేంద్రీకరించాం. 2019 వరల్డ్ కప్కు ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తా. అప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా. టోర్నీ కోసం అద్భుతంగా ప్రిపేర్ అయ్యా. క్రికెటర్గా, వ్యక్తిగా చాలా మంచి స్థితిలో ఉన్నా. అదే ఆలోచన ప్రక్రియను ఇప్పుడు వ్యక్తిగతంగా ఆచరణలో పెడతా’ అని రోహిత్ పేర్కొన్నాడు.
ఓవర్నైట్లో మారలేం
సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ అయినా ఒక్క రాత్రిలో మనిషి మారలేడని రోహిత్ అన్నాడు. ‘ఓ మంచి రిజల్ట్ వచ్చినా లేదా చాంపియన్షిప్ గెలిచినా ఒక రాత్రిలో ఓ వ్యక్తిగా నన్ను మార్చగలదని నేను అనుకోను. గత 16 ఏళ్లుగా నా వ్యక్తిత్వంతో ఎలాంటి మార్పు లేదు. ఆ విషయంలో మారాల్సిన అవసరమూ రాలేదు. ఈ రెండు నెలల్లో లక్ష్యాన్ని ఎలా సాధించాలన్న దానిపైనే నేను, నా టీమ్ దృష్టి పెట్టాం. దాని కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తాం’ అని హిట్మ్యాన్ వ్యాఖ్యానించాడు. ఇండియన్ క్రికెట్ వారసత్వం గురించి మాట్లాడే పెద్ద స్థాయి లేకపోయినా, తన హయాంలో ఏం జరిగిందనేది ప్రజలు మాట్లాడుకుంటే చాలన్నాడు. ‘నేను సంఖ్యలను నమ్మను. నీ ముందున్న సంతోషాన్ని ఆస్వాదించాలి. అలాంటి క్షణంలో జీవించడానికి ప్రయత్నిస్తా. నాకు సంతోషాన్ని ఇచ్చే వాటి గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. నా టీమ్ మెంబర్స్తో మంచి అనుబంధాన్ని ఏర్పర్చుకున్నా. కొత్త జ్ఞాపకాలను సృష్టించడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఆ క్రమంలో మనకు ఏదీ లభించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి’ అని ఈ ముంబైకర్ వెల్లడించాడు.
టీమ్ మెంబర్స్తో మాట్లాడతా
వరల్డ్ కప్ టీమ్లో చోటు దక్కని ప్లేయర్లతో కచ్చితంగా మాట్లాడతానని రోహిత్ చెప్పాడు. 2011 వరల్డ్ కప్ టైమ్లో తనకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని గుర్తు చేసుకున్నాడు. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన 18 మందిలో నుంచి ముగ్గుర్ని తప్పించి15 మందిని సెలెక్ట్ చేస్తారు. ‘పరిస్థితులకు అనుగుణంగా బెస్ట్ కాంబినేషన్ను ఎంపిక చేసుకుంటాం. రకరకాల కారణాలతో కొంత మందికి చాన్స్ ఇవ్వలేకపోవచ్చు. ఈ విషయాన్ని ఆయా ప్లేయర్లతో నేను, రాహుల్ ద్రవిడ్ చర్చిస్తాం. ప్రతి సెలెక్షన్ను పారదర్శకంగా చేస్తాం, మా బలం, బలహీనత, ప్రత్యర్థి, పిచ్ను బట్టి మా ఎంపిక ఉంటుంది. కొన్నిసార్లు తప్పులు జరిగినా వాటికి మేం కట్టుబడి ఉండాల్సిందే’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఆ టైమ్లో బాధపడ్డా
2011 వరల్డ్ కప్ టీమ్లో చోటు దక్కనందుకు చాలా బాధపడ్డానని రోహిత్ అన్నాడు. ఆ సమయంలో యువరాజ్ తనకు చాలా సాయం చేశాడని చెప్పాడు. ‘వరల్డ్ కప్కు నన్ను ఎంపిక చేయకపోవడం చాలా బాధకు గురి చేసింది. బాధతో ఓ గదిలో కూర్చున్నా. ఏం చేయాలో ఆర్థం కాలేదు. అప్పుడు యువీ నన్ను డిన్నర్కు తీసుకెళ్లాడు. నీకు ఆడేందుకు చాలా వయసు ఉంది. ఈ టైమ్ను ఆటను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టు. టీమ్లో చోటు సంపాదించుకో. ఫ్యూచర్లో కచ్చితంగా మంచే జరుగుతుందని యువీ చెప్పాడు’ అని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.