
- ఆఖరి రోజు గంటలోనే ముగిసిన ఆట
- 2–0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసిన గిల్సేన
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను టీమిండియా 2–0తో క్లీన్స్వీప్ చేసింది. రెండో టెస్టులో గెలుపు లాంఛనాన్ని ఆఖరి రోజు గంట సమయంలోనే ముగించింది. కేఎల్ రాహుల్ (58 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటడంతో మంగళవారం, ఐదో రోజు విజయానికి అవసరమైన మరో 58 రన్స్ చేసిన ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది.
టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం. 121 టార్గెట్ ఛేజింగ్లో ఓవర్నైట్ స్కోరు 63/1తో చివరి రోజు ఆట కొనసాగించిన జట్టును రాహుల్ 35.2 ఓవర్లలో 124/3తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మరో ఓవర్ నైట్ బ్యాటర్ సాయి సుదర్శన్ (39)తో కలిసి రెండో వికెట్కు 79 రన్స్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
సుదర్శన్తో పాటు కెప్టెన్ గిల్ (13)ను రోస్టన్ చేజ్ పెవిలియన్ చేర్చగా.. జురెల్ (6 నాటౌట్)తో కలిసి రాహుల్ లాంఛనం ముగించాడు. ఆఖరిరోజు 17.2 ఓవర్లలోనే ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ను ఇండియా 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. విండీస్ వరుసగా 248, 390 స్కోర్లకు ఆలౌటై చిన్న టార్గెట్ను ఇచ్చింది. ఎనిమిది వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జడేజా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు నెగ్గాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248 ఆలౌట్ . వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 390 ఆలౌట్; ఇండియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 121): 35.2 ఓవర్లలో 124/3 (రాహుల్ 58 నాటౌట్, సుదర్శన్ 39, చేజ్ 2/36).
ముందుంది సఫారీ సవాల్
ఈ సిరీస్ రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా ఘన విజయాలు సాధించింది. క్లీన్స్వీప్ విక్టరీతో కీలకమైన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ పాయింట్లూ అందుకుంది. కెప్టెన్ గిల్ తొలి సిరీస్ గెలిచాడు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ, ఈ సిరీస్ ద్వారా టీమిండియాకు వచ్చిన లాభం ఏంటి? స్వదేశంలో బలమైన సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ముంగిట ప్లేయర్లకు లభించిన సానుకూలాంశాలు ఏంటి? అంటే సరైన సమాధానం లభించలేదు.
వెస్టిండీస్ జట్టు బలాన్ని పరిగణనలోకి తీసుకుంటే టీమ్కు పెద్దగా ప్రయోజనం చేకూరలేదనే చెప్పాలి. ఎందుకంటే విండీస్ టాపార్డర్ బ్యాటర్లలో ఒక్కరి సగటు కూడా 35 దాటలేదు. ఆ టీమ్ బౌలర్లకు కూడా ఫస్ట్-క్లాస్ అనుభవం తక్కువే. దాంతో వచ్చే నెలలో సౌతాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీసే ఇండియా జట్టుకు అసలైన సవాల్ కానుంది.
ప్రస్తుతం పాకిస్తాన్తో జరుగుతున్న సిరీస్ను గమనిస్తే, సౌతాఫ్రికా పిచ్లపై టర్న్, అనూహ్య బౌన్స్ కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టమవుతోంది. అక్కడ తొలి రెండు రోజుల్లో పడిన 16 వికెట్లలో 15 స్పిన్నర్లకే దక్కాయి. ఈ నేపథ్యంలో బలహీనమైన విండీస్పై ఫ్లాట్ పిచ్లపై ఆడిన ఇండియా, బలమైన సౌతాఫ్రికా జట్టుపై అదే వ్యూహంతో బరిలోకి దిగడం సరైనదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
మార్క్రమ్, రికెల్టన్, ముల్డర్, బ్రెవిస్, స్టబ్స్ వంటి ఆటగాళ్లతో కూడిన సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ విండీస్ కంటే చాలా రెట్లు బలమైంది. సాధారణ పిచ్పై విండీస్ బ్యాటర్లను ఔట్ చేయడానికి ఇండియా స్పిన్నర్లు ఇబ్బంది పడిన తీరు చూస్తే, ప్రొటీస్పై ఇది మరింత కష్టతరం కావచ్చు. అయితే, పూర్తిగా స్పిన్కు అనుకూలించే పిచ్లను తయారు చేసి ప్రత్యర్థిని పడగొట్టాలనుకోవడం కూడా కత్తి మీద సాము లాంటిదే.
కేఎల్ రాహుల్, జడేజా మినహా ఇండియా బ్యాటింగ్ లైనప్లో యువ ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. జైస్వాల్, గిల్కు సవాల్తో కూడిన పిచ్లపై ఆడిన అనుభవం ఉన్నప్పటికీ, గతంలో కోహ్లీ వంటి మేటి ఆటగాడి సగటు కూడా ఇలాంటి పిచ్లపైనే తగ్గింది. ఈ నేపథ్యంలో, సౌతాఫ్రికాతో జరగబోయే టెస్టులకు వేదికలు కీలకం కానున్నాయి.
కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వికెట్ సాధారణంగా స్పిన్నర్లకు అతిగా సహకరించదు. గువాహతిలోని బర్సపరా స్టేడియం తొలిసారిగా టెస్టుకు ఆతిథ్యం ఇస్తుండటంతో, అక్కడి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న ఎనిమిది నెలల పాటు మరో రెడ్-బాల్ సిరీస్ లేనందున, సౌతాఫ్రికాతో జరగబోయే సిరీసే స్వదేశంలో ఇండియా జట్టు బలాన్ని అంచనా వేయడానికి కీలకం కానుంది.
10 వెస్టిండీస్పై ఇండియాకు ఇది వరుసగా పదో టెస్టు సిరీస్ విజయం. 2002 నుంచి ఆ జట్టుపై విజయయాత్ర కొనసాగిస్తోంది. దాంతో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిరీస్లు నెగ్గిన టీమ్గా సౌతాఫ్రికా రికార్డును సమం చేసింది. సఫారీ టీమ్ కూడా (1998– 2024) వెస్టిండీస్పైనే వరుసగా పది సిరీస్లు గెలిచింది.