టీ20 వరల్డ్‌‌కప్‌‌పై టీమిండియా ఫోకస్

 టీ20 వరల్డ్‌‌కప్‌‌పై టీమిండియా ఫోకస్

న్యూఢిల్లీ: ఆసియా కప్‌‌‌‌లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌పై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా బలమైన జట్టును బరిలోకి దించాలని సెలెక్షన్‌‌ కమిటీ కసరత్తులు చేస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 16న టీమ్‌‌ను ప్రకటించనుంది. కానీ ఇక్కడే సెలెక్షన్‌‌ కమిటీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెన్ను నొప్పితో ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌ నుంచి ఆటకు దూరమైన పేసర్‌‌ బుమ్రా పూర్తిస్థాయిలో కోలుకోలేదని ఎన్‌‌సీఏ వర్గాలు తెలిపాయి. పక్కటెముకల గాయం నుంచి కోలుకున్న హర్షల్‌‌ పటేల్‌‌ బౌలింగ్‌‌ స్టార్ట్‌‌ చేసినా, బుమ్రా మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫిట్‌‌నెస్‌‌ పరీక్ష కోసం ఎన్‌‌సీఏకి వచ్చారు. వీళ్ల గాయాలు, ఫిట్‌‌నెస్‌‌పై ఫిజియోలు నివేదికలు రూపొందిస్తున్నారు.

ఈ రిపోర్ట్స్‌‌ కోసం కెప్టెన్‌‌ రోహిత్‌‌, కోచ్‌‌ ద్రవిడ్‌‌ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్‌‌కప్‌‌కు టీమ్‌‌ను ప్రకటించడానికి ఆఖరి రోజు కూడా  ఈ నెల16వ తేదీనే కావడంతో ఆందోళన మొదలైంది. అయితే మెగా ఈవెంట్‌‌కు మరో నెల రోజుల టైమ్‌‌ ఉండటంతో ఆలోగా బుమ్రా కోలుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా.. మోకాలి గాయంతో మెగా ఈవెంట్‌‌కు దూరమయ్యాడు.