
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా రెండు బ్యాచ్లుగా బుధవారం ఆ దేశానికి బయల్దేరింది. ఉదయం వెళ్లిన బ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ ఉన్నారు. ఫ్లైట్ ఎక్కేముందు ఎయిర్పోర్ట్లో కోహ్లీ, రోహిత్ను గిల్ ఆప్యాయంగా పలుకరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గిల్ తన వద్దకు రాగానే ‘అరే హీరో.. ఎలా ఉన్నావ్’ అంటూ రోహిత్ అతడిని హత్తుకున్నాడు. ఇక, కోచ్ గౌతమ్ గంభీర్ సహా మిగిలిన ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్సాయంత్రం మరో బృందంగా బయల్దేరింది. ఈ నెల19న పెర్త్లో జరిగే తొలి వన్డేతో ఈ టూర్ మొదలవనుంది. ఆ తర్వాత అడిలైడ్, సిడ్నీలో మిగిలిన రెండు మ్యాచ్లు జరగనున్నాయి.
వన్డే సిరీస్ తర్వాత ఈనెల29 నుంచి ఐదు టీ20ల సిరీస్ కూడా జరగనుంది. టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన లెజెండ్స్ కోహ్లీ, రోహిత్ చాన్నాళ్ల తర్వాత ఇండియా జట్టు తరఫున మళ్లీ బరిలోకి దిగనుండటంతో వన్డే సిరీస్పై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ సిరీస్ ఇద్దరి వన్డే ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రోకోను చూసేందుకు ఆసీస్ ఫ్యాన్స్కు ఆఖరి చాన్స్: కమిన్స్
ఈ వన్డే సిరీస్ ఆస్ట్రేలియా అభిమానులకు చాలా ప్రత్యేకమని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ చివరిసారి లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (రోకో)ని గ్రౌండ్లో చూడబోతున్నారని అభిప్రాయపడ్డాడు. ‘గత 15 ఏండ్లుగా విరాట్, రోహిత్ దాదాపు ప్రతి ఇండియా జట్టులోనూ ఉన్నారు. ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియాలో ప్రత్యక్షంగా చూసేందుకు మా అభిమానులకు ఇదే చివరి అవకాశం కావచ్చు’ అని కమిన్స్ పేర్కొనాడు.
రోకో ఇండియా క్రికెట్ చాంపియన్స్ అని కొనియాడాడు. ఆసీస్లో వాళ్లకు ప్రతీసారి అభిమానులను మంచి సపోర్ట్ లభిస్తుందని చెప్పాడు. ఇద్దరూ బరిలో నిలిచిన నేపథ్యంలో ఈ సిరీస్పై తమ దేశంలో ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొందన్నాడు. ఇక, వెన్ను గాయం కారణంగా తాను ఈ సిరీస్కు దూరంగా ఉండడం నిరాశపరిచిందని కమిన్స్ చెప్పాడు.