- వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఘటన
నల్లబెల్లి, వెలుగు : చదువుకోవాలని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గుడ్డెలుగులపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెల్పూరి అశోక్, మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు గణేశ్ (16) ఇంటర్ చదువుతున్నాడు. గణేశ్ కొన్ని రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ, గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడు.
కాలేజీకి రెగ్యులర్గా వెళ్లాలని తండ్రి అశోక్ మందలించి బయటకు వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన గణేశ్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత చుట్టుపక్కల వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గణేశ్ను వరంగల్లోని హాస్పిటల్కు తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రణధీర్రెడ్డి చెప్పారు.
