రాజకీయాల్లోకి వస్తే బాగుపడతరు.. యువతకు తీన్మార్​ మల్లన్న పిలుపు

రాజకీయాల్లోకి వస్తే బాగుపడతరు.. యువతకు తీన్మార్​ మల్లన్న పిలుపు
  • మంచిర్యాల జిల్లా ఆర్కేపీకి చేరిన మహా పాదయాత్ర
  • సందీప్కు రూ.50 వేల ఆర్థిక సాయం

మందమర్రి, వెలుగు : నీతిమంతమైన పాలన కోసం యువత రాజకీయాల్లో రావాలని తీన్మార్​మల్లన్న పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీకి మల్లన్న మహాపాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్కేపీ వారాంతపు సంతలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. యువత వైన్స్ దగ్గరికి వెళితే జీవితాలు నాశనం అయితయని, రాజకీయాల్లోకి వస్తే బతుకులోకి వెలుగులోకి వస్తాయనన్నారు. తాను ధైర్యంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులని విమర్శిస్తున్నానని, దీంతో ఇప్పటి వరకు 50 కేసులు పెట్టారని మరో 5వేల కేసులైనా నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడతానన్నారు.  తాను తప్పు చేస్తే అంబేద్కర్ ​చౌరస్తాలో ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, కుటుంబాన్ని వదిలి ప్రజలకు సేవ చేయడం కోసమే వచ్చానన్నారు. 

సీఎం కేసీఆర్​సంక్షేమ పథకాలంటూ, కాళేశ్వరం ప్రాజెక్టు, కాలువల ద్వారా సాగు, తాగునీళ్లందిస్తామని అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ మోసం చేసున్నాడని తీన్మార్​​ మల్లన్న అరోపించారు. సభ జరుగుతున్న సమయంలో కొందరు గో బ్యాక్ ​అంటూ నినాదాలు చేయడంతో ఇలాంటి వాటికి భయపడనని, తాను కేసీఆర్ కే లొంగలేదన్నారు. తర్వాత మందమరి మండలం గుడిపల్లిలో ఆరుగురు సజీవ దహనమైన స్థలాన్ని పరిశీలించి మృతుడి కొడుకు సందీప్ ను ఓదార్చారు. బాధితుడికి ప్రభుత్వం తరపున రూ.కోటి ఎక్స్​గ్రేషియా, ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలన్నారు. సర్కార్​అండగా లేకపోతే మూడు నెలల్లో తీన్మార్​ మల్లన్న టీం ఇల్లు కట్టించి ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా సందీప్​కు మల్లన్న టీం తరపున రూ.50వేలు అందించారు. 7200 వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి భూమయ్య, టీమ్​ సభ్యులు సుదర్శన్, మంచిర్యాల జిల్లా కన్వీనర్ పార్వతి రాజేష్, టీం సభ్యులు , కొమ్ము రాజేశ్, ముడారపు అనిల్, గంగారపు గౌతమ్, మాస్ రాకేశ్, మంచిర్యాల ఇన్​చార్జి  మహేశ్​పాల్గొన్నారు.