అడ్డికి పావుసేరు చొప్పున భూములు అమ్ముతుండ్రు

అడ్డికి పావుసేరు చొప్పున భూములు అమ్ముతుండ్రు

కరీంనగర్ లో రాజీవ్ స్వగృహ భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారుల నుంచి తీసుకున్న డిపాజిట్ సొమ్ము నుంచి రూ.2 కోట్లతో  67 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించిందని తెలిపారు. సోమవారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కలెక్టర్ అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముతున్నారని మండిపడ్డారు. కోర్టు వివాదాలున్నా .. ఎలాంటి వివాదాలు లేవని కలెక్టర్ పత్రికా ప్రకటనలివ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇవాల్టి నుంచి నిర్వహిస్తున్న రాజీవ్ స్వగృహ భూముల వేలం ద్వారా కొనుగోళ్లు చేస్తే..  భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  కోర్టు వివాదాలు తొలగిపోతే ఆ భూముల విలువ 1000 కోట్ల రూపాయలకు చేరుతుందన్నారు. ఈ భూమి నిజానికి ఆనాటి స్వగృహ లబ్ధిదారులకే చెందాలన్నారు. ‘‘అటు కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే..  ఇటు రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకుంటోంది’’ అని ఆయన కామెంట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల కరీంనగర్ భవిష్యత్తు అవసరాలకు భూమి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.