- 1500 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు డీపీఆర్ రెడీ చేయిస్తున్న జెన్ కో
- ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి బాధ్యతలు
- రూ.9,631 కోట్లతో పనులు
- నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి 0.4 టీ ఏంసీల వాటర్
- రూ.95 వేల కోట్లతో 11 వేల మెగావాట్స్ పీఎస్పీ ప్లాంట్స్ ఏర్పాటుకు 9 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్రంలో తొలి పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఖమ్మం జిల్లా కల్లూరులో 1,500 మెగావాట్ల ప్లాంట్ కోసం జెన్కో సంస్థ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారు చేయిస్తోంది. డీపీఆర్తో పాటు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు, ఇతర అన్ని రకాల క్లియరెన్సులు తీసుకురావాల్సిన బాధ్యతలను ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ. 9,631 కోట్లు ఖర్చు చేయనుంది. నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి 0.4 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు.
రాబోయే ఐదేళ్లలో 2032 నాటికి 7,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చింది. దీంతో ఇప్పటికే 11,210 మెగావాట్ల పీఎస్పీ ప్లాంట్ల ఏర్పాటుకు 9 ప్రైవేట్ కంపెనీలతో రూ. 95 వేల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకుంది. గడువులోగా వీటిని పూర్తి చేస్తే రాష్ట్రంలో ఏటా 12 వేల మెగావాట్లకు మించి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే సామర్థ్యానికి జెన్కో చేరుకుంటుంది.
రాష్ట్రంలో 29 సైట్ల గుర్తింపు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (పీఎస్పీ) ఒకటి. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడంతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని సమర్థవంతంగా నిల్వ చేయడానికి ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్, విండ్ వంటి గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి పెద్దగా జరగడం లేదు.
‘పొద్దున తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే సోలార్, విండ్ పవర్ ఆధారంగా కింద ఉన్న నీటిని ఎత్తయిన ప్రదేశానికి పంపింగ్ చేసి, పీక్ అవర్లో అంటే ఎక్కువ డిమాండ్ ఉండే సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఎత్తున ఉన్న నీటిని కిందికి వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని’ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ సిస్టమ్ అంటారు.
రెండు జలాశయాల మధ్య నీటిని పైకి, కిందికి పంపింగ్ చేస్తూ విద్యుత్ తయారు చేసి నిల్వ చేసుకోవచ్చని ఎలక్ట్రికల్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రెండు రిజర్వాయర్లు అవసరం. ఈ రెండింటి మధ్య కనీసం 100 మీటర్లకు పైగా ఎత్తు తేడా ఉండాలి. సహజసిద్ధంగా ఉన్న కొండలు, పర్వత ప్రాంతాల్లో వీటిని సులభంగా ఏర్పాటు చేయవచ్చు. ఒకసారి పీఎస్పీ ప్లాంట్ ఏర్పాటు చేస్తే 50 నుంచి 100 సంవత్సరాల వరకు సేవలందిస్తుంది.
రాష్ట్రంలో ఇలాంటి అనుకూల పరిస్థితులు ఉన్న 29 స్థలాలను గుర్తించారు. బెంగళూరుకు చెందిన టాటా కన్సల్టెన్సీ 20 సైట్లను, హైబ్రిడ్ అర్బనిస్ట్స్ కంపెనీ 9 సైట్లను సూచిస్తూ టెక్నో- కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారు ఆదేశాల మేరకు జెన్కో సంస్థ ఇంజినీర్లు వీటిపై మళ్లీ సర్వే చేసి, 13 సైట్లలో పనులు చేపట్టడానికి ఆమోదం తెలిపారు. వీటిలో 5 సైట్లను మొదటి ప్రాధాన్యతగా, 4 సైట్లను రెండో ప్రాధాన్యతగా, మరో 4 సైట్లను మూడో ప్రాధాన్యత కింద గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
1500 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు డీపీఆర్ రెడీ చేయిస్తున్న జెన్ కో
రాష్ట్రంలో జెన్కో గుర్తించిన 13 సైట్లలో మొత్తం 12,850 మెగావాట్ల పీఎస్పీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.71,210 కోట్లు ఖర్చు కానున్నట్లు లెక్కలు వేశారు. కాగా, నిధుల లేమీతో ఇబ్బంది పడుతున్న సర్కారు వీటిని ప్రయారిటీ ప్రకారం పూర్తి చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే జెన్కో గుర్తించిన మొదటి ప్రాధాన్యత లిస్ట్లో ఉన్న ఖమ్మం జిల్లాలోని కల్లూరు ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. ఇక్కడ 1,500 మెగావాట్స్ సామర్థ్యం గల పీఎస్పీ ప్రాజెక్ట్ను జెన్కో నిధులు రూ.9,631.13 కోట్లతో వర్క్ చేయడానికి ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్ట్కు అవసరమైన 0.40 టీఎంసీల వాటర్ను నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దీంతో జెన్కో ఆఫీసర్లు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ చేసి ఇవ్వడానికి హైదరాబాద్లోని ఆర్ వీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. డీపీఆర్తో పాటు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు ఇతర అన్నీ రకాల క్లియరెన్స్లు తీసుకొచ్చే బాధ్యత ఈ కంపెనీకి అప్పగించారు. దీనికోసం రూ.7.75 కోట్లు ఫీజు కింద చెల్లించడానికి గతేడాది నవంబర్ 4న అగ్రిమెంట్ చేసుకున్నారు. తొమ్మిది నెలల గడువిచ్చారు.
రూ. 95 వేల కోట్లతో 11 వేల మెగావాట్స్ పీఎస్పీ ప్లాంట్స్ ఏర్పాటుకు ఒప్పందం
రాష్ట్ర ప్రభుత్వం పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ సంస్థలను సైతం ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 2032 నాటికి 7,500 మెగావాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాల్సి ఉన్నది. అయితే వీటి ఏర్పాటకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తుండటంతో ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్–2026’లో 11,210 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.95 వేల కోట్లకు 9 కంపెనీలతో ప్రభుత్వం ముందస్తు ఒప్పందం చేసుకున్నది.
ఒక మెగావాట్కు రూ.25 వేల చొప్పున జెన్కో సంస్థకు ఫీజు రూ.28 కోట్లకు పైగా చెల్లించి అనమతులు తీసుకోవాల్సి ఉన్నది. పీఎస్పీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రైవేట్ కంపెనీల రాకతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.వేల కోట్ల పెట్టుబడి భారం తగ్గనున్నది. ఇదే సమయంలో గ్రీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా పనులు కంప్లీట్ చేసినట్లు అవుతున్నదని జెన్కో ఇంజినీర్లు చెబుతున్నారు.
త్వరలోనే డీపీఆర్
కల్లూరు పీఎస్పీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైల్ త్వరలోనే తమ చేతికి అందనున్నది. ఇప్పటికే తమ ఇంజినీర్లు సైట్ చూసి ఫైనల్ చేశారు. ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు ఆమోదించారు. కొద్ది నెలలుగా ఆర్ వీ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ దీనిపై వర్క్ చేస్తున్నది. ఈ ఫైల్ చేతికి రాగానే రూ.9,631.13 కోట్లతో టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతాం.- హరీశ్, జెన్కో సంస్థ సీఎండీ, హైదరాబాద్
