- కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పిన తెలంగాణ
- త్రీమెంబర్ కమిటీ సమావేశానికి డుమ్మా
హైదరాబాద్, వెలుగు: తాగునీటి కోసం ఐదు టీఎంసీలు కావాలని కోరుతున్న ఏపీ.. నిరుడు (2022 – 23 వాటర్ఇయర్) అవసరానికి మించి ఎందుకు నీటిని తరలించుకుందో చెప్పాలని కృష్ణా బోర్డును తెలంగాణ ప్రశ్నించింది. తాగునీటి కోసం 5 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ ఇటీవల కేఆర్ఎంబీకి ఇండెంట్ పంపింది. దీనిపై చర్చించేందుకు మంగళవారం త్రీమెంబర్కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు రెండు రాష్ట్రాలకు బోర్డు ఇదివరకే సమాచారం ఇచ్చింది. అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్లోకి ఇన్ఫ్లోలే మొదలు కాలేదని.. నీళ్లే లేనప్పుడు సమావేశం ఎందుకని తెలంగాణ ప్రశ్నించింది.
తమకు ఇతర సమావేశాలు ఉండటంతో వాయిదా వేయాలని బోర్డును కోరింది. అయినా బోర్డు సమావేశం నిర్వహించేందుకే మొగ్గు చూపడంతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశానికి హాజరుకాలేదు. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి విజయవాడ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. తాము ప్రతిసారి నీటిని అడుక్కోవాల్సి వస్తున్నదని, తాగునీటి కోసం 5 టీఎంసీలు డ్రా చేసుకునేందుకు వెంటనే వాటర్ రిలీజ్ ఆర్డర్ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని మెంబర్ సెక్రటరీ తోసిపుచ్చారు. తెలంగాణ ఈఎన్సీ సమావేశానికి హాజరుకానుందన ఆ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా వాటర్రిలీజ్ఆర్డర్ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఇంత కీలక సమావేశానికి తెలంగాణ ఎలా డుమ్మా కొడుతుందని ఏపీ ఈఎన్సీ ప్రశ్నించారు.
ముందే ఎందుకు వాడుకున్నట్టు?:తెలంగాణ ఈఎన్సీ
సమావేశం ముగిసిన తర్వాత బోర్డు మెంబర్సెక్రటరీతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాగార్జున సాగర్లోకి ఇప్పటి వరకు ఇన్ఫ్లోనే లేదని, హైదరాబాద్జంట నగరాలతో పాటు మిషన్ భగీరథ అవసరాల కోసం తమ కోటా నీటిని మాత్రమే సాగర్ లో నిల్వ ఉంచామని ఆయన గుర్తు చేశారు. సాగర్లో ఎండీడీఎల్కు ఎగువన 13 టీఎంసీలే ఉన్నాయని, అవి తమ తాగునీటి అవసరాలకే సరిపోతాయన్నారు. ఏపీకి తాగునీటి అవసరాలు ఉంటాయని తెలిసినప్పుడు.. ఆ రాష్ట్రం మే నెలాఖరు నాటికే నీటిని అడ్డదిడ్డంగా వాడుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము ఏటా తెలంగాణ కోటా నీటిని సాగర్లో నిల్వ ఉంచుకునే వాడుకుంటున్నామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే ఏపీకి నీటి విడుదలపై అభిప్రాయం చెప్తానని తెలిపారు.