హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం అక్రమంగా తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణ పనులు చేపడుతోందని, వాటిని నిలిపి వేయించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్కు లేఖ రాశారు. కడప జిల్లాలోని శ్రీఅవధూత కాసినాయన మండలంలోని ఇటుగులపాడు, సవిసెట్టిపల్లి, కొండ్రాజుపల్లి, వరికుంట్ల, గంగానపల్లి గ్రామాల్లోని చెరువులను నింపేందుకు శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్పై ఏపీ ప్రభుత్వం కొత్తగా ఎత్తిపోతల పథకం చేపట్టిందని వివరించారు. బేసిన్ అవతలికి కృష్ణా నీటిని తరలించేలా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని, దీంతో కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణలో గల ఫ్లోరైడ్ ప్రభావ ప్రాంతాలు, నాగార్జునసాగర్ ఆయకట్టు, హైదరాబాద్ తాగు నీటిపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని వివరించారు. విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు నిర్మించేందుకు అపెక్స్ కౌన్సిల్, కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అని గుర్తుచేశారు. బోర్డు వెంటనే జోక్యం చేసుకొని తెలుగు గంగ ప్రాజెక్టు విస్తరణను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
4న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ మీటింగ్
కేఆర్ఎంబీ రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ నాలుగో మీటింగ్ ఆగస్టు 4న నిర్వహించనున్నట్లు కన్వీనర్ రవికుమార్ పిళ్లై కమిటీ సభ్యులకు మంగళవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్, పవర్ జనరేషన్ ప్రొటోకాల్, అన్ని ప్రాజెక్టులు నిండి సముద్రంలోకి నీళ్లు చేరుతున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వినియోగించుకునే వరద నీటిని లెక్కించడంపై చర్చిస్తామని తెలిపారు.