- ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు
- సీసీ కెమెరాల నిఘాలో ఆర్ఓ ఆఫీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కీలక కౌంట్ డౌన్ మొదలైంది. శుక్రవారం (3వ తేదీ) నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. ఈ మేరకు ఈసీ, సీఈఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా రిటర్నింగ్ ఆఫీ సర్ కార్యాలయాల వద్ద అన్ని రకాల భద్రతా ఏర్పాట్లతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు.
ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5వ తేదీన ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు తీసుకోరు. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో ఆ రెండు, మూడు రోజుల్లోనే ఎక్కువ నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. నామినేషన్ రోజు నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణకు ఎన్నికల సంఘం 60 మంది అధికారులను ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా నియమించింది. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు.