కేసీఆర్ కు ఎన్నికలే తప్ప ప్రజలు అక్కర్లేదు

కేసీఆర్ కు ఎన్నికలే తప్ప ప్రజలు అక్కర్లేదు

సీఎం కేసీఆర్ కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉండదని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కొల్లి మాధవి అన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నిరోజులు కాళీగా ఉండి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్ అకస్మాత్తుగా మునిసిపల్ చట్టం తెద్దామనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు కేటాయించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మున్సిపల్ చట్టం తెచ్చేముందు అఖిలపక్ష సమావేశం పెట్టి సూచనలు తీసుకోవాలని మాధవి అన్నారు. చట్టాల్లో మార్పు తేవడానికి ప్రయత్నించకుండా , ముందు కేసీఆర్ లో మార్పు రావాలని ఆమె అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు.

కేసీఆర్ పోకడ చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రా? లేదా నిజాం ప్రభువా? అనే విషయం అర్ధం కావట్లేదని ఆమె అన్నారు. కేసీఆర్ అంటేనే రాచరికం, రాజకీయమన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్.. సోషల్ మీడియాలో స్పందించి అదే పాలన అని ఫీలవుతున్నారని ఆమె చెప్పారు.

పిల్లల ఆత్మహత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ.. బహుశా మహిళలకు మంచి స్థానం ఇస్తే కేసీఆర్ కు గండముందని ఎవరైనా చెప్పారేమో? అని ఎద్దేవా చేశారు.