- ఇంకా ఈసీ నుంచి రాని పర్మిషన్
- షెడ్యూల్ ప్రకారం నేడు జరగాల్సిన మీటింగ్
- ఎజెండాలో రుణమాఫీ, మేడిగడ్డ, విభజన చట్టం, అకడమిక్ ఇయర్ వంటి ఇంపార్టెంట్ ఇష్యూస్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర కేబినెట్భేటీ సందిగ్ధం నెలకొన్నది. శనివారం (ఈ నెల 18న) కేబినెట్ మీటింగ్నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల నిర్ణయించారు. అయితే, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో సమావేశంనిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎస్ శాంతి కుమారి అనుమతి కోరారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో కేబినెట్ మీటింగ్ఉంటుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ శనివారం ఉదయం ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియేట్లో కేబినెట్ మీటింగ్ జరుగనున్నది.
ఎజెండాలో పలు అంశాలు
ఒకవేళ శనివారం కేబినెట్ మీటింగ్ జరిగితే.. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ, అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. రుణమాఫీకి అవసరమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూనిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు.
విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ తదితర అంశాలపై కేబినెట్ మీటింగ్లో డిస్కస్ చేయనున్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై డిస్కస్ చేయనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్ లో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.
