తెలంగాణ కేబినెట్ భేటీపై సందిగ్ధం!

తెలంగాణ కేబినెట్ భేటీపై సందిగ్ధం!
  • ఇంకా ఈసీ నుంచి రాని పర్మిషన్​ 
  • షెడ్యూల్​ ప్రకారం నేడు జరగాల్సిన మీటింగ్​
  • ఎజెండాలో రుణమాఫీ, మేడిగడ్డ, విభజన చట్టం, అకడమిక్ ​ఇయర్​ వంటి ఇంపార్టెంట్ ఇష్యూస్​

హైదరాబాద్​, వెలుగు :  రాష్ట్ర కేబినెట్​భేటీ సందిగ్ధం నెలకొన్నది.  శనివారం (ఈ నెల 18న) కేబినెట్ మీటింగ్​నిర్వహించాలని సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల నిర్ణయించారు. అయితే, ఎలక్షన్​ కోడ్​ అమల్లో ఉండటంతో సమావేశం​నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని సీఎస్​ శాంతి కుమారి అనుమతి కోరారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో కేబినెట్​ మీటింగ్​ఉంటుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ శనివారం ఉదయం ఈసీ నుంచి గ్రీన్​ సిగ్నల్​ వస్తే మధ్యాహ్నం లేదంటే సాయంత్రం సీఎం  రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియేట్​లో  కేబినెట్​ మీటింగ్​ జరుగనున్నది. 

ఎజెండాలో పలు అంశాలు

ఒకవేళ శనివారం కేబినెట్​ మీటింగ్​ జరిగితే.. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ,  అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు. రుణమాఫీకి అవసరమైన కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తూనిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది. నివేదికలోని సిఫారసులు, తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతుంది. స్కూళ్లు, కాలేజీల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు.

 విద్యార్థుల నమోదు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్​ల పంపిణీ తదితర అంశాలపై కేబినెట్​ మీటింగ్​లో డిస్కస్​ చేయనున్నారు. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై డిస్కస్​ చేయనున్నారు.  రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై కేబినెట్ లో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారని తెలిసింది.