
హైదరాబాద్, వెలుగు: ఇండియా యంగ్ ఆర్చర్, తెలంగాణ బిడ్డ తానిపర్తి చికిత చరిత్ర సృష్టించింది. కెనడాలోని వినిపెంగ్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచింది. తద్వారా కాంపౌండ్ అండర్– 21 విమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ఇండియా తొలి మహిళా ఆర్చర్గా రికార్డుకెక్కింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో చికిత 142–136తో కొరియాకు చెందిన యెరిన్ పార్క్ను ఓడించి జూనియర్ వరల్డ్ చాంపియన్గా నిలిచింది. ఐదు రౌండ్ల పోటీలో తొలి ఎండ్లో 29–29తో స్కోరు సమం అవ్వగా.. సెకండ్ ఎండ్లో వరుసగా రెండు పర్ఫెక్ట్ టెన్స్తో చికిత 28 పాయింట్లు రాబట్టగా.. యెరిన్ 24 పాయింట్లకే పరిమితం అయింది. ఫలితంగా 57–53తో ఆధిక్యంలో నిలిచిన చికిత చివరి వరకూ అదే జోరు కొనసాగించి ఈజీగా గెలిచింది.