హైదరాబాద్, వెలుగు: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తానన్న కేసీఆర్.. ఆ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
గిరిజన కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పినప్పటికీ వాటికి పైసా కూడా రాలేదని ఆరోపించారు. ఐటీడీఏ ఫండ్స్ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. గిరిజనులకు కేసీఆర్ పోడు పట్టాలను ఇవ్వడం లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను తీసుకొచ్చి కాంగ్రెస్ వారికి మేలు చేస్తే.. కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని విమర్శలు గుప్పించారు.
ట్యాంక్బండ్పై చెట్లు పెట్టినంత మాత్రాన, లుంబినీ పార్క్ వద్ద బంగ్లా కట్టినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదన్నారు. కేసీఆర్కు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, ఓటమి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ను గెలిపించి తెలంగాణను సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.