
- పార్లమెంట్ ఆవరణలో నిరసన
- ‘మా వాటా మాకు ఇవ్వండి- తెలంగాణ రైతుల్ని కాపాడండి’ అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకొని ఆందోళన
- లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన ఎంపీలు
- కేటాయించిందే పంపాలని కోరుతున్నం: మల్లు రవి
- తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?: ఎంపీ బలరాం నాయక్
- బీజేపీ.. రైతుల ద్రోహి: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ కుట్రలు చేస్తున్నదని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపించారు. ఇందులో భాగంగానే తెలంగాణకు యూరియాను రిలీజ్ చేయడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల ముందు ద్రోహిగా నిలబెట్టాలని చూస్తున్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత సృష్టించడాన్ని నిరసిస్తూ.. సోమవారం పార్లమెంట్ఆవరణలో తెలంగాణ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ‘మా వాటా - మాకు ఇవ్వండి– తెలంగాణ రైతుల్ని కాపాడండి’ అని రాసి ఉన్న ఫ్లకార్డులు పట్టుకొని నినదించారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీ కృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్, సురేశ్ షెట్కార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభం కాకముందే తెలంగాణ రైతుల పక్షాన కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్రెడ్డి కలిసి.. రాష్ట్ర వాటా యూరియాను రిలీజ్ చేయాలని కోరారన్నారు.
అయినప్పటికీ కేంద్రం స్పందించకుండా తెలంగాణ రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు. తాము రాష్ట్రానికి అదనంగా యూరియా ఇవ్వాలని కోరడం లేదని, కేటాయించిన వాటానే రిలీజ్ చేయాలని అడుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణకు మొత్తం 8.30 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయిస్తే.. కేవలం 5.32 లక్షల టన్నులు మాత్రమే రిలీజ్ చేసినట్టు చెప్పారు. ప్రతి నెలా రావాల్సిన వాటా కన్నా తక్కువగా యూరియా సరఫరా చేసి...రాష్ట్రంలో కేంద్ర సర్కారు యూరియా కొరతను సృష్టించిందని తెలిపారు. కేంద్ర సర్కారు చర్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. లోక్ సభలో ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చినట్టు తెలిపారు. కానీ ఈ తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడం బాధాకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల ముగింపు వరకు యూరియా కోసం మకరద్వార్ ముందు ఆందోళన చేస్తామని తెలిపారు.
ఆనాడు యుద్ధం పేరు చెప్పి..: ఎంపీ చామల
జూన్ చివరి వారంలో కేంద్రమంత్రి నడ్డాను సీఎం రేవంత్ రెడ్డి కలిశారని ఎంపీ చామల గుర్తు చేశారు. ‘‘జులైలోనే మొత్తం యూరియాను కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఆగస్టు వరకు ఆపితే అన్నదాతలు ఇబ్బందులు పడతారని అప్పట్లోనే చెప్పారు. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా నడ్డాను కలిసి.. యూరియా కేటాయించాలని కోరారు. అప్పట్లో యుద్ధం అని కేంద్రం సాకుచెప్పింది. కృష్ణపట్నం, కాకినాడ పోర్టుకు రాగానే పంపిస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులంతా.. యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. ఇది ప్రజా సమస్య. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు కూడా నడ్డా దగ్గరకు రావాలి. వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. వారు వీలైనంత వరకు ఒత్తిడి తేవాలి. మేమంతా చిత్తశుద్ధితో యూరియా కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే యూరియా కొరత ఉందని మరో ఎంపీ సురేశ్ షెట్కార్అన్నారు. తెలంగాణ, కర్నాటక రైతుల విషయంలో ఇలాంటి ఆలోచన మంచిది కాదని హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము పోరాటాలు చేశామని, ఏనాడూ బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం ఉద్యమాలు చేయలేదని, కనీసం రైతుల కోసం ఇప్పుడైనా కలిసి రావాలని పిలుపునిచ్చారు. . రైతుల బాధలు రాష్ట్రంలోని బీజేపి మంత్రులు, ఎంపీలకు కనిపించడం లేదా? అని రాజ్యసభ ఎంపీ అనిల్ మండిపడ్డారు.
బీజేపీ యూరియా చోరీ: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కేంద్రంలోని బీజేపీ సర్కారు ఓట్ చోరీతోపాటు యూరియాను కూడా చోరీ చేస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఏనాడూ రైతుల పక్షాన నిల్చోని బీజేపీ.. రైతు ద్రోహి అని ఫైర్ అయ్యారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను తక్షణమే రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతులకు సంబంధించిన ఈ అంశంపై చర్చ చేపట్టాలని లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చినట్లు చెప్పారు. గతంలో రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) మూతపడిందని గుర్తు చేశారు. నాడు ఎంపీగా ఉన్న ప్రస్తుత మంత్రి గడ్డం వివేక్.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో మాట్లాడి రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేయించారని వివరించారు.
అలా రీఓపెన్ చేయించిన ఆర్ఎఫ్ సీఎల్లో ప్రస్తుతం మిస్ మ్యానేజ్ స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఇటీవల తాను ఈ ఫ్యాక్టరీని విజిట్ చేసిన సందర్భంలో అనేక లోపాలు బహిర్గతం అయ్యాయని తెలిపారు. సుమారు 12 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాల్సిన పరిశ్రమలో.. కేవలం 9 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. దాదాపు 30 శాతం ఫ్యాక్టరీ మూతపడే ఉంటున్నదని చెప్పారు. మిస్ మేనేజ్మెంట్పై ఆఫీసర్లను ప్రశ్నించినట్లు తెలిపారు. 100 శాతం ఫ్యాక్టరీ నడిచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘యూరియా కోసం దాదాపు 3 నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలం కలిసి.. కేంద్రాన్ని కోరుతున్నాం. అయినా యూరియాను తెలంగాణకు ఇవ్వడం లేదు. బీజేపీ రైతుల ద్రోహి అని ఏడాది కిందట జరిగిన ఎన్నికల సమయంలో చెప్పాం. ‘‘కేవలం మేమే రైతుల కోసం పోరాడుతున్నాం. బీజేపీ ఎంపీలు ఎందుకు రైతులను పట్టించుకోవడం లేదు. తెలంగాణకు సంబంధించి.. ఏ ఇష్యూపైనా బీజేపీ పోరాడడం లేదు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు నెరపడంలో బీజేపీ సర్కార్ ఫెయిల్ అయింది. అందుకే ఉక్రెయిన్, చైనా దేశాల నుంచి యూరియా తీసుకురావడంలో విఫలమైంది’’ అని విమర్శించారు.
రామగుండంలో ఫ్యాక్టరీ.. నోయిడాలో ఆఫీసు: ఎంపీ బలరాం నాయక్
ఎక్కడ ఫ్యాక్టరీలు ఉంటే అక్కడ ఆఫీసులు, అధికారులు ఉంటారని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. కానీ తెలంగాణలోని రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఉంటే.. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆఫీసు ఏర్పాటు చేయడం బీజేపీ కుట్రలో భాగమేనని తెలిపారు. దాదాపు 40 మంది అధికారులు ఇక్కడి నుంచి పని చేస్తున్నారని చెప్పారు. ‘‘అలహాబాద్లో ఫ్యాక్టరీ ఉంటే.. అక్కడే ఆఫీసర్లు ఉన్నారు. కానీ.. రామగుండం పరిస్థితి అలా లేదు. కుట్ర ప్రకారమే తెలంగాణ రైతులకు బీజేపీ యూరియా ఇవ్వడం లేదు. రామగుండంలో తయారైన యూరియాను తెలంగాణకు ఇవ్వడం లేదు. దీంతో తెలంగాణకు యూరియా సరఫరాలోనూ ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ఎరువులు, రసాయనాల స్టాండింగ్ కమిటీ మెంబర్గా ప్రతి మీటింగ్లో తాను ఒత్తిడి చేస్తున్నా కేంద్ర సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండి పడ్డారు. లోకల్గా రామగుండంలో తయారైనది కాకుండా.. దిగుమతి చేసుకున్న యూరియా ఇస్తామని చెబుతూ రాష్ట్రాన్ని పక్కదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. ఇవన్నీ కేవలం కాంగ్రెస్ సర్కారుపై రైతుల్లో విషం నింపేందుకు బీజేపీ చేస్తున్న డ్రామాలని ఫైర్ అయ్యారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.