
- సైబర్ నేరాలు ఏటా 50% పెరుగుతున్నయ్
- పోయినేడాది 48.47% పెరిగిన
- సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు 43 శాతం
- క్రైమ్ ఇన్ తెలంగాణ రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏటా సైబర్ నేరాలు దాదాపు 50 శాతం పెరుగుతున్నాయి. ఆర్థిక నేరాలు, చీటింగ్ కేసులూ భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. 2021లో 10,303 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. గతేడాది15,297 నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్లో 4,436 కేసులు ఫైల్ అయ్యాయి. 2021లో నమోదైన నేరాలతో పోల్చితే 2022లో 48.47 శాతం సైబర్ నేరాలు పెరిగాయి. ఆర్థిక నేరాలు 41.37శాతం, చీటింగ్ కేసులు 43.30శాతం ఎక్కువయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్ సీఆర్బీ) తరహాలోనే రాష్ట్ర సీఐడీ పోలీసులు స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో–2022 నివేదికను రూపొందించారు.
నేరాల వివరాలతో కూడిన ‘‘క్రైమ్ ఇన్ తెలంగాణ–2022’’ బుక్ను డీజీపీ రవిగుప్తా, సీఐడీ చీఫ్ మహేష్ భగవత్ మంగళవారం రిలీజ్ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీఆర్బీ రిపోర్ట్ను రిలీజ్ చేయడం ఇదే తొలిసారి. ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని సేఫ్టీ సిటీల్లో హైదరాబాద్3వ ర్యాంక్ మెట్రో పోలీస్ సిటీగా నిలించింది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది 1,74,205 కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయగా మొత్తం సీసీటీవీ కెమెరాల సంఖ్య10,25,849కి చేరింది. వీటి ఫుటేజీల ఆధారంగా గతేడాది వరకు మొత్తం18,234 కేసులను పోలీసులు ఛేదించారు.