
తత్కాల్ టిక్కెట్ బుకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి భారతీయ రైల్వే (IRCTC) చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. ఈ మోసాల వెనుక ఉన్న కారణాలను గుర్తించి చర్యలు చేపట్టింది.
అనేక ఏజెంట్లు, మోసగాళ్లు నకిలీ ఈమెయిల్ ఐడీలతో IRCTC వెబ్సైట్లో లక్షలాది నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశారు. వీటి ద్వారా తత్కాల్ టిక్కెట్లు అందుబాటులోకి రాగానే కొన్ని సెకన్లలోనే వాటిని బుక్ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు లభించడం చాలా కష్టంగా మారింది.
సస్పెక్టెడ్ PNRలు: 2025 జనవరి నుంచిమే మధ్య కాలంలో తత్కాల్ బుకింగ్ విండో ఓపెన్ అయిన ఐదు నిమిషాల్లోనే 2.9 లక్షల అనుమానాస్పద PNRలను (Passenger Name Records) IRCTC గుర్తించింది. ఇవి మోసపూరిత బుకింగ్లుగా గుర్తించింది.
డిస్పోజబుల్ ఈమెయిల్ డొమైన్ల బ్లాకింగ్: ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసేందుకు ఉపయోగించిన 6,800కు పైగా డిస్పోజబుల్ ఈమెయిల్ డొమైన్లను రైల్వే అధికారులు బ్లాక్ చేశారు.
మోసాలకు ఇలా చెక్ పెట్టింది..
యాంటీ-బాట్ సిస్టమ్స్, AI టెక్నాలజీ వినియోగించి IRCTC తత్కాల్ టికెట్ మోసాలకు చెక్ పెట్టింది. యాంటీ-బాట్ సాఫ్ట్వేర్లను ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లేటెస్ట్ టెక్నాలజీ సొల్యూషన్లను వినియోగించింది. ఇవి ఆటోమేటెడ్ స్క్రిప్ట్లను ,ఫ్రాడ్ బుకింగ్లను గుర్తించి అడ్డుకుంటాయి. గతంలో తత్కాల్ బుకింగ్ సమయంలో 50% లాగిన్ ప్రయత్నాలు బాట్ల నుంచే వచ్చేవని ఈ కొత్త చర్యల వల్ల ఈ సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.
త్వరలో ఇ-ఆధార్ ప్రామాణీకరణ (e-Aadhaar authentication) : తత్కాల్ టిక్కెట్ల బుకింగ్కు ఇ-ఆధార్ ప్రామాణీకరణ తప్పనిసరి చేసింది. దీనివల్ల ప్రయాణికులు తమ ఆధార్ నంబర్ను ఉపయోగించి OTP ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. ఆధార్తో అనుసంధానమైన IRCTC ఖాతాలు ఉన్నవారికి టిక్కెట్ల బుకింగ్లో ప్రాధాన్యం ఉంటుంది.
మోాాసాలపై ఫిర్యాదులు: ఇటువంటి మోసాలపై జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో 134 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ చర్యల వల్ల తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విజయవంతం అయ్యే నిష్పత్తి అక్టోబర్ 2024 నుంచి మే 2025 మధ్య 43.1శాతం నుండి 62.2శాతానికి పెరిగిందని IRCTC అధికారులు తెలిపారు. ఈ చర్యలు నిజమైన ప్రయాణికులకు టిక్కెట్లు సులభంగా లభించేలా చేయడంలో సహాయపడతాయి.