
బెంగళూరు చిన స్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ సంబరాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయి, 50 మందికి పైగా గాయపడినప్పటికీ స్టేడియం లోపల ఈవెంట్ను కొనసాగించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బయట హాహాకారాలు, ఆర్తనాదాలు చేస్తూ తొక్కిసలాటలో అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.
ఇంత విషాదం జరిగితే.. ఇదేమీ పట్టనట్టుగా లోపల నవ్వులు, సంతోషంతో ఫొటోలకు ఫోజులు ఏంటని నెటిజన్లు నిలదీస్తున్న పరిస్థితి. అయితే.. ఈ విమర్శలపై ఐపీఎల్ చైర్మన్ మౌనం వీడారు. స్టేడియం లోపల ఉన్న తమకు తొక్కిసలాట జరిగిన విషయం తెలియదని.. అఫిషియల్స్కు కూడా సమాచారం లేదని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఈవెంట్ యాజమాన్యంతో తాము మాట్లాడామని.. ఈవెంట్ను త్వరగా ముగిస్తామని తమతో చెప్పారని ఆయన తెలిపారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని ఐపీఎల్ చైర్మన్ నిట్టూర్చారు.
#WATCH | Bengaluru | Karnataka Deputy CM DK Shivakumar felicitates the #IPL2025Champions #RoyalChallengersBengaluru at the Vidhana Soudha.#RoyalChallengersBengaluru clinched their first #IPL trophy yesterday after defeating Punjab Kings. pic.twitter.com/7aDKRA6gCM
— ANI (@ANI) June 4, 2025
18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు కల నెరవేరిన వేళ ఆ జట్టును విషాదం వెంటాడిన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాలకు వెళ్లిన అభిమానుల్లో 11 మంది తొక్కిసలాటలో చనిపోయారు. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. చిన స్వామి స్టేడియం దగ్గర ఈ తొక్కిసలాట దుర్ఘటన జరిగింది. ఆర్సీబీ జట్టు యాజమాన్యం కూడా ఈ తొక్కిసలాట ఘటనపై స్పందించింది. సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
#WATCH | Bengaluru, Karnataka: Visuals from outside Chinnaswamy Stadium, where the slippers and shoes are scattered. A stampede occurred here, claiming the lives of 11 people and injuring 33 people. pic.twitter.com/5DBhW9IFli
— ANI (@ANI) June 4, 2025
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన గురించి తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యామని, ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని భద్రత తమకు ఎంతో ముఖ్యమని.. చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని RCB పేర్కొంది. స్టేడియం బయట ఉన్న పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ఈవెంట్ను త్వరగా ముగించామని, ప్రభుత్వం సలహాలను పాటించి ఈవెంట్ ముగించేశామని ఆర్సీబీ తెలిపింది. ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన ఆర్సీబీ సపోర్టర్స్ కోలుకుని క్షేమంగా ఉండాలని ఆర్సీబీ యాజమాన్యం ఆకాంక్షించింది.