దయ్యాలు.. కోవర్టుల పంచాది పెండింగ్ ! ఈ నెల 11 తర్వాతే.. ఆ ముగ్గురి ఇష్యూపై క్లారిటీ

దయ్యాలు.. కోవర్టుల పంచాది పెండింగ్ ! ఈ నెల 11 తర్వాతే.. ఆ ముగ్గురి ఇష్యూపై క్లారిటీ
  • 10న అమెరికా నుంచి హైదరాబాద్కు కేటీఆర్
  • 11న కేసీఆర్ ను విచారించనున్న కాళేశ్వరం కమిషన్
  • నోటీసులపై ఫాంహౌస్ లో ప్రిపేర్ అవుతున్న కేసీఆర్
  • జాగృతి విస్తరణ పనుల్లో ఎమ్మెల్సీ కవిత బిజీ
  • కవితకు షోకాజ్ నోటీసులిస్తారంటూ మీడియాకు లీకులు

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన అన్నా చెల్లెళ్ల గొడవకు శుభం కార్డు పడేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలున్నాయని, కేసీఆర్ దేవుడని ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారంటూ వ్యాఖ్యానించారు. మరుసటి  రోజు కేసీఆర్ అమెరికా వెళ్లిపోయారు. తర్వాత ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా అనేక అంశాలను ప్రస్తావించారు. అంతటితో ఆగక  ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం కాదు రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేయాలంటూ పరోక్షంగా కేటీఆర్ ను ఉద్దేశించి కామెంట్లు చేశారు.

కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంపై ఫైర్ అయ్యారు. ఊరూరా ఆందోళనలు జరగాల్సిన సందర్భాన్నీ పక్కన పెట్టారంటూ విమర్శలు చేశారు. ఆ తర్వాత సింగరేణి జాగృతి పేరుతో కమిటీ వేశారు. అనుబంధ సంఘాలకు కన్వీనర్లను నియమిస్తూ తన సొంత సంస్థను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నిన్న ఇందిరా పార్కు వద్ద భారత జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు.

బీఆర్ఎస్ నేతలు దూరం
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. కేవలం జాగృతి కార్యకర్తలు మాత్రమే ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు కవిత శిబిరంలోకి వెళ్లకుండా కట్టడి చేస్తున్నారా..? అన్న టాక్ కూడా వచ్చింది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ధర్నా జరుగుతోందని, కనీసం కాజ్ కోసమైనా వెళ్లాల్సిందనే వాదన కూడా ఉంది.  ఏది ఏమైనా బీఆర్ఎస్లో నిశ్శబ్ధ వాతావరణం రాజ్యమేలుతోంది.

కవితపై సోషల్ వార్
ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. పార్టీకి, కేటీఆర్కు సపోర్టుగా నిలిచే సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ఆమె మీద పరోక్షంగా దాడి జరుగుతూనే ఉంది. కొందరు నేతలు కవితను విమర్శించడమే పనిగా పోస్టులు పెడుతున్నారు. మొన్నటి వరకు కవితను వెన్నంటి ఉన్న వారు కూడా ఏకంగా వ్యతిరేక పోస్టులు పెడుతుండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది.  నెటిజన్లను ఆందోళనకు గురి చేస్తోంది.