- ఎంక్వయిరీలో హెచ్ఎం వీరంగం
- సర్దిచెప్పిన స్థానిక లీడర్లు
మిడ్జిల్, వెలుగు : మిడ్జిల్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ టీచర్లు బుధవారం పాఠశాల సమయంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్కు వెళ్లిన ఘటనపై తెలంగాణ విద్యా కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేశ్, డీఈఓ రవీందర్తో కలిసి గురువారం విచారణ చేపట్టారు. జరిగిన సంఘటనపై కమిషన్ మెంబర్ సీరియస్ అయ్యారు. ఎంక్వయిరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’గా మారుస్తామని హామీ ఇచ్చారు. టీచర్లు స్థానిక నాయకులతో సహకరించుకొని అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.
కాగా, విచారణ జరుగుతుండగానే పాఠశాల టీచర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. తనపై అసత్య ఆరోపణలు చేశాడన్న కోపంతో హెచ్ఎం, సహచర టీచర్ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించడం అక్కడ కలకలం రేపింది. స్థానికులు, అధికారులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శంకర్ నాయకులు వెంకటయ్య, సాయిలు, రామ్ గౌడ్, రమేశ్, పర్వతాలు ఉన్నారు.
