
- ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులకు సంఘీభావం
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించవద్దని స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కోరింది. ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది. నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజనీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) పిలుపు మేరకు..గురువారం హైదరాబాద్లోని సదరన్డిస్కం కార్పొరేట్ ఆఫీస్ ముందు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరసన తెలిపింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో గత 184 రోజులుగా అక్కడి విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపింది.
తెలంగాణ ఉద్యోగులతోపాటు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్ కార్మికులు లంచ్ అవర్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మింట్ కాంపౌండ్లో జరిగిన కార్యక్రమంలో పవర్ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ.. యూపీ ప్రభుత్వం సర్వీస్ రెగ్యులేషన్లను మార్చి ఉద్యోగులను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కన్వీనర్ రత్నాకర్ రావు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేస్తున్న ఉద్యోగులను యూపీ సర్కార్ భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
యూపీ ప్రభుత్వం సర్వీస్ రెగ్యులేషన్లను మార్చి, తొలగింపుకు ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా విద్యుత్ కార్మికులు ఒక్కతాటిపై నిలబడతామని హెచ్చరించారు. యూపీలో విద్యుత్ ఉద్యోగులను వేధిస్తే దేశవ్యాప్తంగా కార్మికులు చూస్తూ ఊర్కోరని స్పష్టం చేశారు. రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ లోని డిస్కంలతో పాటు అన్ని జనరేటింగ్ స్టేషన్లలో నిరసనలు నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ రెడ్డి, పీ సదానందం, కరుణాకర్రెడ్డి, గోవర్దన్, మోసెస్, శ్రీనివాస్, భూపాల్ రెడ్డి, తాజుద్దీన్, వరప్రసాద్, వేణు, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రావు పాల్గొన్నారు.