- ఇప్పటివరకు ఉన్న రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను పెంచిన ఈఆర్సీ
- రెండు నెలల్లోనే చెల్లించాలని డిస్కంలకు ఆదేశం
- లక్షలాది రైతు కుటుంబాలకు మేలు
- ఈ ఏడాది విద్యుత్ శాఖలో రూ.15,105 కోట్ల రెవెన్యూ లోటు
- రూ.14 వేల కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి సర్కారు ఆమోదం
- డిస్కంల రెవెన్యూ వివరాలు ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులెవరైనా విద్యుత్షాక్తో మరణిస్తే బాధిత కుటుంబాలకు రూ.8 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని విద్యుత్ డిస్కంలను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) ఆదేశించింది. విద్యుత్శాఖ తరఫున ఇప్పటివరకు రూ.5 లక్షల పరిహారం ఇస్తుండగా ఈ ఏడాది నుంచి మరో రూ.3 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ డబ్బులను సంఘటన జరిగిన రెండు నెలల్లోపే బాధిత కుటుంబాలకు అందించాలని స్పష్టం చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర ఉత్తర, దక్షిణ డిస్కంలకు సంబంధించిన రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్ను బుధవారం ఈఆర్సీ విడుదల చేసింది. అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్(ఏఆర్ఆర్)తో పాటు రెవెన్యూ లోటు వివరాలను ప్రకటించింది. ఈ ఏడాది విద్యుత్శాఖలో రూ.15,105 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సబ్సిడీల కింద రూ.14 వేల కోట్లను డిస్కంలకు అందించడానికి ఆమోదం తెలిపినట్లు వివరించింది. గతేడాది లాగే ఈసారి కూడా డొమెస్టిక్ కరెంట్చార్జీలను పెంచడం లేదని తెలిపింది.
రావాల్సిన ఆదాయం రూ.65,559.29 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.65,559.29 కోట్ల రెవెన్యూ రావాల్సి ఉండగా.. వినియోగదారుల నుంచి రూ.50,278.60 కోట్లు వసూలు కానున్నట్లు ఈఆర్ సీ స్పష్టం చేసింది. దక్షిణ డిస్కం(ఎస్పీడీసీఎల్)లో క్రాస్ సబ్సిడీ సర్చార్జీ ద్వారా రూ.168.28 కోట్లు, అడిషనల్సర్చార్జీ ద్వారా రూ.6.50 కోట్లు(మొత్తం రూ.50,453.38 కోట్లు) సమకూరుతాయని తెలిపింది. మిగతాది రెవెన్యూ లోటు అని పేర్కొంది. ఇందులో వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా పథకం కింద రూ.12,181.21 కోట్లు, గృహలక్ష్మి స్కీంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి రూ.1,818.79 కోట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపింది. ఇంకా రూ.1,105.91 కోట్ల లోటును రెగ్యులేటరీ అసెట్ కిందకు మార్చినట్లు చెప్పింది.
రాష్ట్రంలో 20 లక్షలకు పైగా రైతు కుటుంబాలు
రూ.8 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా సన్న, చిన్నకారు, కౌలు రైతుల కుటుంబాలు, 29 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గతంలో రైతులు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్మోటార్లకు రిపేర్లు చేస్తూ విద్యుత్షాక్కు గురై చనిపోయేవారు. విద్యుత్శాఖ ఆఫీసర్లు సరిగా పట్టించుకోక బాధితులకు పరిహారం అందేది కాదు. ఇప్పుడు పరిహారాన్ని పెంచడంతోపాటు రెండు నెలల్లోనే అందించాలని ఆదేశించడం హర్షణీయమని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి వరంగల్జిల్లాకు చెందిన ఎన్ రెడ్డి హంసరెడ్డి పేర్కొన్నారు.
