
- అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు
- పోస్టర్ను రిలీజ్ చేసిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు: ఆలయాల్లో సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగుల సంక్షేమ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. అలాగే, గ్రాట్యూటీని రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. సోమవారం సెక్రటేరియెట్లో మంత్రి కొండా సురేఖ అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి పోస్టర్ను ఆవిష్కరించి, మాట్లాడారు. సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని సహాయ కమిషనర్ స్థాయి వరకు గల దేవాలయాల్లో పని చేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు సంక్షేమ నిధితో లబ్ధి చేకూరుతుందన్నారు.
‘‘అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యూటీ ఇస్తారు. ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించే గ్రాట్యూటీని నిర్ధారించాం. మరణానంతరం చెల్లించే ఎక్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం చెల్లింపులకు ఈ నిధి ఉపయోగపడుతుంది. ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు, మరమ్మతుల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేయడం జరుగుతుంది. పథకాలలో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు గ్రాట్యూటీ పథకానికి ఈ ఏడాది మే 28 నుంచి అర్చక సంక్షేమ బోర్డు గతంలో చెల్లించిన గ్రాట్యూటీ రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు ప్రభుత్వం పెంచింది.
ఈ గ్రాట్యూటీ సదరు ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఏక మొత్తంలో వారి సర్వీసు కాలానికి లోబడి చెల్లిస్తాం. ఎవరైనా అకాలం మరణం చెందితే.. అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం ఇచ్చే రూ.20 వేలను రూ.30 వేలకు పెంచాం”అని మంత్రి చెప్పారు. ఈ అంశంపై ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, డైరెక్టర్ వెంకటరావు, అధికారులు పాల్గొన్నారు.