ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ .. ఏడు నెలల్లో 142 కేసులు.. 145 మంది అరెస్ట్

ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ .. ఏడు నెలల్లో 142 కేసులు.. 145 మంది అరెస్ట్
  • అవినీతి అధికారులకు చెక్​.. ఫిర్యాదులతో వెంటనే రంగంలోకి
  • మీడియేటర్ల ద్వారా దందా సాగించే లంచగొండుల లిస్టు రెడీ
  • త్వరలో ప్రభుత్వానికి రిపోర్ట్​ అందజేయనున్న ఏసీబీ
  • జనం నుంచి ఫిర్యాదుల కోసం టోల్​ ఫ్రీ, వాట్సాప్​ నంబర్లు​
  • ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ఆఫీసర్లపైనా నజర్​
  • అవినీతిలో ముందు వరుసలో రెవెన్యూ, పోలీస్​, మున్సిపల్​

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో యాంటీ కరప్షన్​ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. అన్ని శాఖలను జల్లెడ పడ్తున్నది. లంచగొండుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నది. ఏడు నెలల్లో ఏకంగా 142 కేసులు నమోదు చేసింది. 145 మంది అవినీతి అధికారులను పట్టుకున్నది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీబీకి ఫ్రీ హ్యాండ్​ ఇచ్చింది. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా.. ఏ హోదాలో ఉన్నా.. ఉపేక్షించొద్దని తేల్చిచెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో లంచాల విషయం తెలిస్తే తమకు సమాచారం అందించాలంటూ టోల్​ఫ్రీ నంబర్​ను, వాట్సాప్​ నంబర్​ను జనంలోకి విస్తృతంగా ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్నారు.

బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి.. లంచగొండులకు చెక్​ పెడ్తున్నారు.  అక్రమాస్తులు ఉన్న ఆఫీసర్లనూ గుర్తిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన 8 మంది ఉన్నతాధికారుల ఇండ్లలో ఇటీవల తనిఖీలు చేసి.. వందల కోట్లు విలువ చేసే ఆస్తులను ఏసీబీ సీజ్​ చేసింది. 

మీడియేటర్ల ద్వారా దందా చేసేవాళ్లపై..!

అవినీతి ఎక్కువగా జరిగే ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నారు. చాలాచోట్ల అవినీతి అధికారులు మీడియేటర్లు, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగుల ద్వారా తమ చేతికి మట్టి అంటకుండా పని కానిస్తున్నారు. దాన్ని కూడా ఏసీబీ గుర్తించి.. వారిపైనా చర్యలకు ఉపక్రమిస్తున్నది. ఇలాంటి అధికారుల లిస్టును ప్రత్యేకంగా రెడీ చేసి.. ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. 

సగటున నెలకు 20 మంది పట్టివేత

ప్రతి నెల సగటున 20 మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. నిరుడు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 11 నెల వ్యవధిలో  211 కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఇందులో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు(జులై 20 వరకు) ఏడు నెలల వ్యవధిలో ఏకంగా 142 కేసులు నమోదవగా.. 145 మంది అరెస్టయ్యారు. అంటే సగటున నెలకు  20 కేసులు రికార్డవుతుండగా..  20 మంది అరెస్టవుతున్నారు. ఏడునెలల్లో పట్టుబడ్డవాళ్లలో 20 మంది మహిళా అధికారులతోపాటు పలువురు ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఏడు నెలల్లో రూ.28.57 లక్షల లంచం డబ్బులను ఏసీబీ సీజ్​ చేసింది.  

ఆ మూడు శాఖల్లోనే ఎక్కువ

ఏడు నెలల వ్యవధిలో ఏసీబీ నమోదు చేసిన కేసులు, పట్టుబడ్డ అధికారుల లెక్కలు చూస్తే.. అవినీతిలో ఫస్ట్​ ప్లేస్​లో  రెవెన్యూ శాఖ, రెండో ప్లేస్​లో పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ, మూడో ప్లేస్​లో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఉన్నాయి. రెవెన్యూలో 27 మందిని, పోలీస్ డిపార్ట్​మెంట్​లో  26 మందిని, మున్సిపల్ శాఖలో  18 మందిని ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్​లో  17 మందిని, సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజిస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల్లో  10 మందిని, ఎలక్ట్రిసిటీలో  9 మందిని, ఇరిగేషన్​లో  ఐగుదురిని అదుపులోకి తీసుకున్నారు. 

రెవెన్యూ శాఖలో ఆరుగురు ఆర్​ఐలు, నలుగురు సర్వేయర్లు,  పోలీస్​ శాఖలోని ఒక డీఎస్పీ,  ఐదుగురు సీఐలు, పది మంది ఎస్​ఐలు పట్టుబడ్డవాళ్లలో  ఉన్నారు. మున్సిపల్​ శాఖలో మున్సిపల్​ కమిషనర్​ కూడా పట్టుబడ్డారు. వీటితో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న అధికారుల వివరాలు రాబడ్తున్నది. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా ఉన్న హరిరామ్​, మురళీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఈఈ నూనె శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. 

లంచం అడిగితే.. ఫిర్యాదు చేయండి

ప్రజలకు సర్వీస్ చేసేందుకే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఇవ్వకూడదు. ఎవరైనా లంచం అడిగినా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాస్తులు కూడబెట్టినా మాకు సమాచారం ఇవ్వండి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు, లేదా 94404 46106 వాట్సాప్ నెంబర్​కు, లేదా dg_acb@telangana.gov.in మెయిల్​కు ఫిర్యాదు చేయొచ్చు.

- విజయ్ కుమార్,
డీజీ, ఏసీబీ