
తెలంగాణ ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టం 2025ను అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలులోకి తీసుకువచ్చింది. మొదటగా రాష్ట్రంలోని నాలుగు మండలాలను, ఆ తర్వాత జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. గ్రామస్థాయిలలో భూ సమస్యల పరిష్కారం కోసం వినతులు స్వీకరించి పరిష్కారం వైపుగా అడుగులు వేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులు పర్యటించి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతాలు అనగానే అనేక భూ సమస్యలకు నెలవు.
ఈ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా) ఉమ్మడి పాకాల కొత్తగూడా (ప్రస్తుత గంగారా మండలం) పుట్టల భూపతి గ్రామ తరహాలో ఏజెన్సీల్లో భూముల రీసర్వే చేసి భూ సమస్యలు, భూ రికార్డుల సమస్యలు పరిష్కరించాలి.
అసలు పుట్టల భూపతిలో ఏమి జరిగింది? అని చూస్తే పుట్టల భూపతి అనే గ్రామం 100 పైచిలుకు కుటుంబాలతో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న కోయ ఆదివాసీ గూడెం. 2016వ సంవత్సరంలో భూభారతి చట్ట రూపకర్త భూమి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ సహకారంతో ఈ గ్రామాన్ని సందర్శించి.. రెవెన్యూ భూముల భూ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయని క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు.
ఈ గ్రామంలోని భూమి మొత్తం సోలం రాజయ్య పేరుమీద భూమి రికార్డులు ఉన్నాయి సాగులో మాత్రం 100కు పైగా కుటుంబాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం గ్రామంలోని యువతకు, రైతులకు భూములు, భూ చట్టాలు, భూమి రికార్డులపై అవగాహన కల్పించారు. ఇంటింటి సర్వే చేసి ప్రస్తుతం సాగులో ఉన్న 100కు పైగా కుటుంబాలకు భూముల రీ సర్వే చేసి గట్టు తగాదాలు లేకుండా హద్దులు నిర్ణయించారు. కేవలం 3 నెలల కాలంలో పట్టాల పంపిణీ పేరుతో పాస్ పుస్తకాలు పంచి బ్యాంకులలో క్రాప్లోన్లు తీసుకోగా 20 లక్షల పైగా రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగింది.
ఈ గ్రామ రైతులకు రైతు భరోసా, రైతు బీమా, కిసాన్ యోజన పథకాల కింద ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోంది. ఈ గ్రామాన్ని దేశంలోని 17 రాష్ట్రాల ప్రతినిధులు సందర్శించి ఈ గ్రామ తరహాలోనే భూముల రీసర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించటం గమనార్హం. ఆదివాసీ గిరిజనులకు భూ రికార్డులపై అవగాహన లేకపోవడం వల్ల ఇప్పటికీ తాతల తండ్రుల పేర్లు మీద రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతంలో జరిగే భూముల అమ్మకాలు, కొనుగోలు మొత్తం సాదాబైనామా పేరుతో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
సమస్యలను పరిష్కరించాలి
గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్ఓఆర్ 2020 ధరణి పోర్టల్ లో నమోదు చేసే క్రమంలో ప్రభుత్వ భూములను వలస గిరిజనేతరులు రికార్డులలోకి నమోదు చేసుకున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనులకు అసైన్మెంట్, రెవెన్యూ పట్టాలు ఇవ్వగా అటవీ రెవెన్యూ వివాదం వల్ల ధరణిలో అటవీ భూములుగా నమోదయ్యాయి. దీంతో పట్టాలు రాక భూముల అమ్మకాలు కొనుగోలు చేయలేక ప్రభుత్వ లబ్ధికి దూరమైనారు. ఈ ప్రాంతంలో అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు 2008–-09, 2002 – 23 సంవత్సరం మధ్యకాలంలో అటవీ హక్కు పత్రాలు ఇవ్వటం జరిగింది.
ఏజెన్సీ ప్రాంతంలో భూ బదలాయింపు నిబంధనలు 1959, 1/ 70 అమలులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకొని ఏజెన్సీ ప్రాంతంలో భూములన్ని భూభారతి పోర్టల్ లో ప్రత్యేక కాలం పార్ట్– సీలో నమోదు చేయాలి. అటవీ, రెవెన్యూ వివాదాలు ఉన్న భూములలో జాయింట్ సర్వే చేసి అటవీ, రెవెన్యూ హద్దు సమస్యలను పరిష్కరించాలి. అటవీ హక్కు పత్రాలు వచ్చిన భూముల వివరాలు భూభారతి పోర్టల్ లో ప్రత్యేక కాలంలో నమోదు చేసి బ్యాంకుల నుంచి క్రాప్ లోన్లు ప్రభుత్వ లబ్ధి వచ్చేలా చూడాలి. ఈ పుట్టల భూపతి గ్రామం తరహాలో ఏజెన్సీ గుడాలన్నింటిలో భూముల రీసర్వే చేసి వాస్తవ సాగుదారులైన గిరిజనులకు భూ రికార్డులు, భూమి పట్టాలు పంపిణీ చేయాలి.
వాసం ఆనంద్ కుమార్,ఆదివాసీ అడ్వకేట్స్ అసోసియేషన్