- ఏకపక్షంగా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటారా? అని ప్రశ్న
- తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు స్వాధీనం చేస్కోవాలన్న ఏపీ
హైదరాబాద్, వెలుగు: గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న పెద్దవాగు తప్ప ఇంకే ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ తేల్చి చెప్పింది. తమకు కనీసం మాటైనా చెప్పకుండా ప్రాజెక్టుల స్వాధీనానికి నోట్స్ ఎలా తయారు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం బీపీ పాండే నేతృత్వంలో జీఆర్ఎంబీ (గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్) సబ్ కమిటీ ఆరో మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ, కన్నెపల్లి పంపుహౌస్, ఏపీలోని వెంకటనగరం పంపింగ్ స్కీంపై ఈ సమావేశంలో చర్చించారు.
బోర్డు గెజిట్లో పేర్కొన్న 11 ప్రాజెక్టుల్లోని ఐదు ప్రాజెక్టులు, మరికొన్ని కాంపోనెంట్లను షెడ్యూల్- 2 నుంచి షెడ్యూల్-3లోకి మార్చాల్సిందిగా బోర్డుతో పాటు కేంద్ర జలశక్తి శాఖను కోరామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. తమ విజ్ఞప్తిపై బోర్డు, కేంద్రం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని, కాబట్టి ఆ ప్రాజెక్టుల గురించి చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2021 అక్టోబర్ 11న నిర్వహించిన బోర్డు 12వ సమావేశంలో ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టును ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని, ఆ ప్రాజెక్టు పూర్తి సమాచారం ఇప్పటికే బోర్డుకు అందజేశామని వివరించింది. ప్రాజెక్టుల విజిట్ సహా అన్ని అంశాలనూ బోర్డు మీటింగ్లో చర్చకు పెట్టాలని, కానీ, అందుకు విరుద్ధంగా బోర్డు సెక్రటేరియట్ సభ్యులు చెప్పాపెట్టకుండా ప్రాజెక్టులను పరిశీలించి వాటిని అప్పగించేందుకు ఏకపక్ష నిర్ణయాలతో మినిట్స్ను రూపొందిస్తున్నారని విమర్శించింది. సబ్కమిటీ ఐదో మీటింగ్లో తమ అభిప్రాయాలను మినిట్స్లో చేర్చలేదని, వాటన్నింటినీ మినిట్స్లో చేర్చాలని సూచించింది.
‘వెంకటనగరం’ ఇచ్చేందుకు ఏపీ ఓకే
ఏపీలోని వెంకటనగరం పంపింగ్ స్టేషన్ను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ సర్కారు అంగీకారం తెలిపింది. తమ ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులనూ స్వాధీనం చేసుకోవాలని కోరింది. దీన్ని తెలంగాణ తీవ్రంగా తప్పు బట్టింది. తమ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని స్పష్టం చేసింది. బచావత్ అవార్డులోని నాలుగో క్లాజు ప్రకారం తమ వాటా నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకునే హక్కు ఉందని తేల్చి చెప్పింది. అలాంటప్పుడు తమ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని కోరడం సమంజసం కాదని పేర్కొంది.