విరించి ఆస్పత్రిలో కరోనా చికిత్స బంద్

విరించి ఆస్పత్రిలో కరోనా చికిత్స బంద్

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని విరించి హాస్పిటల్ లో కోవిడ్ చికిత్స చేసేందుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రిలో కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్రొటోకాల్  ప్రకారం చికిత్స కొనసాగించాలని తెలిపింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే హాస్పిటల్ లైసన్సును రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. నల్గొండ జిల్లాకు చెందిన బాధితుడు వంశీ అనే వ్యక్తి కృష్ణ కుటుంబం‌ వచ్చిన ఫిర్యాదు అధారంగా ప్రభుత్వం ఆస్పత్రిపై  చర్యలు తీసుకుంది.

వంశీకృష్ణ కుటుంబ సభ్యులు విరించి ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించగా పరిస్థితి విషమించడంతో నిన్న మరణించడం.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వంశీకృష్ణ సోదరి.. కుటుంబ సభ్యులు గొడవకు దిగిన విషయాలు తెలిసిందే. ఆస్పత్రి వైద్యులు  కోవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా వైద్యం అందించారంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అధికారులు విరించి ఆస్పత్రి కి నోటీసులు పంపారు. నోటీసు ఇచ్చి 24 గంటలు గడిచినా విరించి ఆస్పత్రి యాజమాన్యం సమాధానం ఇవ్వకపోవడంతో ఆస్పత్రిలో కరోనా ట్రీట్మెంట్ ను వెంటనే నిలిపివేయాలని.. ఇక ముందు ఎవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆస్పత్రిలో  కోవిడ్ ట్రీట్ మెంట్ రద్దు చేయడం‌‌‌ ఇది రెండోసారి కావడం గమనార్హం.