పోతిరెడ్డిపాడు విస్తరణ ప్లాన్ తో ఇరకాటంలో సర్కార్​

పోతిరెడ్డిపాడు విస్తరణ ప్లాన్ తో ఇరకాటంలో సర్కార్​
  • కేసీఆర్​ స్పందించకనే జీవోదాక వచ్చిందన్న రైతులు
  • పాలమూరు, నల్గొండ ప్రాంతాలుఎడారి అవుతాయన్న ఆందోళన
  • ‘మౌనం’పై ప్రతిపక్షాల ఫైర్​
  • దీంతో కృష్ణాబోర్డుకు సర్కార్​ లేఖ
  • ఈ పరిణామాలతో జగన్​తో దోస్తికి గండి

పోతిరెడ్డిపాడు అంశం టీఆర్ఎస్​ సర్కారును ఇరకాటంలోకి నెట్టేసింది. శ్రీశైలం నుంచి భారీగా నీళ్లు తరలించుకునేలా ఏపీ ఆరు నెలల కిందే లిఫ్ట్​ స్కీంకు రూపకల్పన చేసినా.. ఇప్పుడా విషయం చిచ్చు రాజేసింది. ఏపీ సీఎం జగన్​తో కేసీఆర్​ దోస్తీ, ఇద్దరి మధ్య ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రైతులు మండిపడుతున్నారు. ఏపీ కట్టే ప్రాజెక్టుతో శ్రీశైలం ఖాళీ అవుతుందని.. పాలమూరు, నల్గొండ జిల్లాలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపాలంటూ రాష్ట్ర సర్కారు కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఈ పరిణామాలతో జగన్​తో కేసీఆర్​ దోస్తీకి గండి పడుతోందన్న చర్చ సాగుతోంది.

పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేసేందుకు ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం తెలంగాణలో చిచ్చురాజేసింది. అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు రాజకీయవర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం పోతిరెడ్డిపాడు మాటెత్తకుండా సైలెంట్ గా ఉన్న సీఎం కేసీఆర్ ను ఇరుకున పడేసింది. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ దోస్తీ, ఇద్దరి మధ్య ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతున్నట్టు జగన్ ఆరునెలల కిందే ప్రకటించారని, కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకు ఉన్నాయని నిలదీస్తున్నాయి.పోతిరెడ్డిపాడుపై ఏపీ సర్కారు జీవో జారీ చేసిన విషయం బయటికి వచ్చి ఐదు రోజులు గడిచాక టీఆర్ఎస్ సర్కారు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఏపీ కట్టే ప్రాజెక్టుతో శ్రీశైలం ఖాళీ అవుతుందని,తమకు చుక్క నీరందని దుస్థితి వస్తుందంటూ పాలమూరు, నల్గొండ జిల్లా రైతులు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలల కిందే జగన్ నిర్ణయం

కృష్ణా నీటిని రాయలసీమకు తరలించాలనే నిర్ణయం రహస్యంగా ఏమీ జరగలేదు. ఏపీ సీఎంజగన్ బహిరంగంగానే ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్ లో కడప జిల్లా పర్యటన సందర్భంగా పోతిరెడ్డిపాడు కెపాసిటీని డబుల్ చేస్తున్నట్టు చెప్పారు. వెంటనే కొందరు రిటైర్డ్​ ఇంజనీర్లు ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారని, అయినాస్పందన ఏదీ రాలేదని అప్పట్లో ప్రచారం జరిగింది.

దోస్తీకి బీటలు పడ్డయా?

పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో జగన్ తో కేసీఆర్ దోస్తీ ముగిసిందా అనే చర్చ టీఆర్ఎస్ నేతల్లో జరుగుతోంది. ఏడాదికాలంలో జగన్ ప్రగతి భవన్ వచ్చిన ప్రతిసారీ కేసీఆర్ ఆయనను పొగిడారు. జగన్ అంతేస్థాయిలో కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు.కానీ ఇప్పుడీ పరిస్థితి వస్తుందని ఊహించలేదని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు కామెంట్ చేశారు. ‘‘సీఎం చైర్ లో జగన్ ను చూసేందు కు కేసీఆర్ చాలా కష్టపడ్డారు. అనేక రకాలుగా సాయం చేశారు. అన్నింటినీ జగన్ ను మర్చిపోయారు. పోతిరెడ్డిపాడుపై జీవో ఇచ్చే ముందు కనీసం కేసీఆర్ తో మాట్లాడి ఉండాల్సింది’’అని ఆయన పేర్కొన్నారు. అయితే గత ఏడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా కంచియాత్రకు వెళ్లొస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నారు. ఆ సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను ఇప్పుడు కొందరునేతలు గుర్తు చేస్తున్నారు. ఆ రోజున కేసీఆర్‘‘గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి, రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం . రతనాల సీమగా చేస్తాం ”అని మాటిచ్చారని.. అందులో భాగంగానే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయా అని చర్చించుకుంటున్నారు.

కేసీఆర్​ సర్కారు తీరు సిగ్గుచేటు

‘‘ఆంధ్రా, తెలంగాణ సీఎంల మధ్య లోపాయకారీ ఒప్పందం ఏమిటో వెంటనే బయటపెట్టాలి. ఏపీ సీఎం జగన్​ తమ రాష్ట్రానికి లాభమొచ్చే పనిచేస్తుంటే.. సీఎం కేసీఆర్​ మాత్రం తెలంగాణ నాశనం కావడం కోసం తాపత్రయ పడుతున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్​ సర్కారు తీరు సిగ్గుచేటు. దీనిని నిరసిస్తూ దీక్ష చేపడతాం.

– బండి సంజయ్, ఎంపీ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

జగన్​కు ఐడియా ఇచ్చింది కేసీఆరే

పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకోవటానికి ఏపీ సీఎం జగన్ కు ఐడియా ఇచ్చింది సీఎం కేసీఆరే. దానికి అడ్మినిస్ట్రేటివ్​ శాంక్షన్​ ఇచ్చినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నారు. విమర్శలు రావడంతోనే ఇప్పుడు అడ్డుకుంటామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు. జగన్ కు, కేసీఆర్ కు కామన్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి. ఇరు రాష్ట్రాలను దోచుకోవాలనేది వాళ్ల కుట్ర.

– జి. వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ,బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు

కేసీఆర్​ మౌనం రాష్ట్రానికి చేటు

పోతిరెడ్డిపాడుపై సీఎం కేసీఆర్​ మౌనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశాన్ని నాశనం చేస్తోంది. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్​పూర్తిగా విఫలమయ్యారు. ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కు ఉన్న సంబంధాలను బయట పెడతాం. కేసీఆర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ధర్నాలు చేస్తాం.

– ఉత్తమ్ కుమార్ రెడ్డి,  ఎంపీ,   పీసీసీ చీఫ్​

సీఎం కేసీఆర్ సుప్రీంలో పోరాడతామన్నారు