
- ఎకరానికి రూ.1.20 కోట్లు ఇచ్చేందుకు సర్కార్ రెడీ
- మెయిన్ రోడ్డు, ఇంటి జాగా విషయంలో ఆగిన చర్చలు
- ఓరుగల్లులో మొదలైన ఖరీఫ్ పంట సీజన్
- వారంలో క్లారిటీ రాకుంటే 220 ఎకరాల్లో చివరి పంట వేసే యోచనలో రైతులు
వరంగల్, వెలుగు: వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ భూముల్లో ఖరీఫ్ పంట వేసే విషయంలో రైతులు డైలమాలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసే క్రమంలో రైతుల వద్ద సేకరించే భూములకు అధికారులు అప్పట్లోనే మార్కింగ్ పెట్టారు. రైతులు మాత్రం గత నవంబర్లో యాసంగి పంట సాగుచేశారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కోతలు కూడా పూర్తయ్యాయి. భూసేకరణలో ప్రభుత్వం ఎన్నో చర్చల అనంతరం రైతుల భూముల ధరలను ఖరారు చేసింది.
రైతులు తమ సాగు భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. కాగా, వారు అడిగిన ఒకట్రెండు డిమాండ్లపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో ఓరుగల్లులో ఖరీఫ్ సీజన్ మొదలైంది. కొందరు రైతులు ఖరీఫ్ చివరి పంట వేసేందుకు దుక్కి దున్నుతుండగా.. ఇంకొందరు మాత్రం పంట మధ్యలో భూములు అప్పగించాల్సి వస్తే పరిస్థితి ఏంటనే అయోమయంలో ఉన్నారు.
నాలుగు గ్రామాలు.. 220 ఎకరాలు.. 309 మంది రైతులు
మామునూర్ ఎయిర్పోర్ట్ విస్తరణకు 949.14 ఎకరాల భూములు అవసరం. ప్రస్తుతానికి 696.14 ఎకరాల భూములు ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్నాయి. అభివృద్ధికి మరో 280.30 ఎకరాల భూమి అవసరం పడుతుందని ఆఫీసర్లు కన్ ఫాం చేశారు. అయితే ఇందులోనూ కొంత ప్రభుత్వ భూమి ఉండడంతో మిగిలిన 220 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించేందుకు ప్లాన్ రెడీ చేసింది.
ఇందులో ప్రధానంగా గుంటూర్పల్లి, నక్కలపల్లి, దూపకుంట, గాలిపల్లి పరిధిలోని నాలుగు గ్రామాలకు చెందిన 309 మంది రైతుల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. మరో 50 మంది వద్ద 61,134.5 గజాల వరకు చిన్నపాటి భూములు, ప్లాట్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంది.
ఎకరాకు రూ.1.20 కోట్ల పరిహారం..
మామునూర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు అంశంలో గతంలో కొంత అయోమయం ఉన్నా.. జీఎంఆర్ సంస్థతో 150 కిలోమీటర్ల అగ్రిమెంట్ సమస్య పరిష్కరించడంతో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని భూములు అప్పగించాలని కోరింది. దీంతో భూసేకరణ ఇక కంపల్సరీ అయింది. భూనిర్వాసితులకు ఏకకాలంలో పరిహారం కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ గత ఏడాది నవంబర్17న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పటి నుంచి సాగులో ఉన్న భూములకు ఎంత ధర కేటాయించాలనే దానిపై రైతులతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పలుమార్లు సమావేశమయ్యారు. మొదటిసారి చర్చల్లో ఎకరానికి రూ.25 నుంచి రూ.30 లక్షలు ఇస్తామని చెప్పారు. ఆపై రైతులకు అన్యాయం చేయొద్దనే భావనతో రాష్ట్ర సర్కారు క్రమేపీ ధరలు పెంచుతూ రూ.60 లక్షలు, రూ.80 లక్షలు, రూ.96 లక్షల వరకు పెంచింది. చివరి చర్చల్లో నెగొసియేషన్ కమిటీ కాన్సెంట్ అవార్డుగా ఎకరానికి రూ.1.20 కోట్లుగా
నిర్ణయించింది.
ఖరీఫ్ సాగు చేయాలా? వద్దా?
ఎయిర్పోర్ట్ కోసం భూములిస్తున్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.1.20 కోట్ల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైంది. అయితే ఎయిర్పోర్ట్ నిర్మించే క్రమంలో ప్రస్తుత ఖమ్మం రోడ్లోని రంగశాయిపేట నుంచి గవిచర్ల వైపు వెళ్లే రోడ్ మూసివేయబోతున్నారు. ఎయిర్పోర్ట్ భూనిర్వాసితుల గ్రామాలన్నీఈ మార్గంలోనే ఉన్నాయి. ఈ దారి మూసేస్తే గాడిపల్లి రోడ్ మీదుగా రెండు, మూడు కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంది. దీంతో ఈ నాలుగు గ్రామాల రైతులు మొదటి నుంచి తమకు మెయిన్రోడ్ ఇవ్వాలని అడుగుతున్నారు. భూముల ధరలకు క్లారిటీ ఇచ్చిన అధికారులు, దీనిపై ఎటువంటి హామీ ఇవ్వలేదు.
కాగా, భూములు కోల్పోతున్న రైతులు ప్రస్తుతం తమకు 250 గజాల చొప్పున ఇంటి జాగాలు కేటాయించాలని డిమాండ్ పెట్టారు. దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ వారికి ఎటువంటి హామీ ఇవ్వలేదు. అదేటైంలో.. వానలు కురిసి ఖరీఫ్ సీజన్ మొదలవడంతో పలువురు రైతులు దుక్కి దున్ని నారు పోస్తున్నారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు చివరి పంట వేసుకోవచ్చనే ఆలోచనలో కొందరు రైతులు ఉన్నారు. మరికొందరు మాత్రం భూసేకరణ చివరి దశలో ఉండి, అధికారులు పాసుబుక్కులు అడుగుతున్న నేపథ్యంలో.. పంటవేస్తే పెట్టుబడి, సమయం వృథా అవుతుందని భావిస్తున్నారు. మెజార్టీ రైతులు మాత్రం ఖరీఫ్ పంట సాగు విషయంలో అధికారులు, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.