- కరోనా పేరిట తెలంగాణలో స్టేజ్1 ఎగ్జామ్ వాయిదా
- జూన్లో జరగనున్న స్టేజ్2 పరీక్ష
- వేలాది మందికినష్టం జరుగుతుందని పేరెంట్స్ ఆందోళన
మెదక్, వెలుగు: ప్రతిభగల విద్యార్థులకు జాతీయ స్థాయిలో స్కార్షిప్లు ఇచ్చేందుకు నిర్వహించే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్టీఎస్ఈ) నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదు. ఈ పరీక్షను కేంద్రప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ద్వారా రెండు స్టేజ్లలో నిర్వహిస్తోంది. మిగతా రాష్ట్రాల్లో ఫస్ట్ స్టేజ్ పరీక్ష గత జనవరిలో జరిగాయి. అక్కడ రిజల్ట్స్ కూడా ప్రకటించారు. తెలంగాణలో మాత్రం కరోనా ఆంక్షల పేరిట వాయిదా వేశారు. ఎన్సీఈఆర్టీ రెండో స్టేజ్ పరీక్ష జూన్12న నిర్వహిస్తున్నట్టు ప్రకటించడంతో ఆక్కడి విద్యార్ధులు ప్రిపేరేషన్ ప్రారంభించారు. తెలంగాణ స్టూడెంట్లు ఇంకా ఫస్ట్స్టేజ్ ఎగ్జామ్కోసం ఎదురుచూస్తున్నారు. తక్కువ టైమ్లో రెండు స్టేజీల పరీక్షలకు ప్రిపేర్ కావాల్సిఉన్నందున మిగతా రాష్ట్రాల వారికన్నా వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ప్రతిభ గల స్టూడెంట్స్ను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం ఈ ఎగ్జామ్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. రెండు దశల పరీక్షల్లో టాప్ వచ్చిన వెయ్యి మంది స్టూడెంట్స్ను సెలెక్ట్ చేసి.. ఉన్నత విద్య కోసం స్కాలర్ షిప్ ఇస్తారు. ఇంటర్మీడియట్లో నెలకు రూ.1,250, డిగ్రీ, పీజీలో నెలకు రూ.2 వేలు, పీహెచ్డీ చేసే వారికి నెలకు రూ.5 వేల చొప్పున స్కాలర్ షిప్ వస్తుంది. స్టేజ్ -2 ఎగ్జామ్ పాసై స్కాలర్ షిప్కు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కు జేఈఈ లో, నీట్ ఎగ్జామ్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏటా తెలంగాణా నుంచి చాలా మంది స్కాలర్షిప్ లకు ఎంపికవుతుంటారు. ఎన్సీఈఆర్టీ షెడ్యూల్ ప్రకారం జనవరి 16న జరగాల్సిన స్టేజ్ 1 పరీక్ష ను తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించలేదు. కొవిడ్ తీవ్రత తగ్గి.. విద్యా సంస్థలు అన్నీ తెరిచినప్పటికీ ప్రభుత్వం ఈ ఎగ్జామ్ గురించి పట్టించుకోవడంలేదు. ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకు స్కాలర్ షిప్ రావడంతోపాటు, జేఈఈ, మెడిసిన్ అడ్మిషన్ కోసం నిర్వహించే నీట్ పరీక్షలో రాణించేందుకు ఉపయోగపడుతుందన్న ఆశతో చాలామంది పదో తరగతి స్టూడెంట్స్ నెలల తరబడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. చాలామంది ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకుంటారు. స్టేజ్ 2 ఎగ్జామ్ కూడా దగ్గర పడుతున్నందున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, త్వరగా స్టేజ్ -1 పరీక్ష నిర్వహించి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలని పేరెంట్స్కోరుతున్నారు.
ఏడాది నుంచి ప్రిపేర్ అవుతున్నా
నేను టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ కోసం ఏడాది నుంచి ప్రిపేర్ అవుతున్న. జనవరి నెలలోనే స్టేజ్ -1 నిర్వహించి ఉంటే ఆ పరీక్షతో పాటు టెన్త్ఎగ్జామ్స్కు, స్టేజ్ 2 కోసం ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండేది. డిలే కావడంవల్ల స్టేజ్2 ఎగ్జామ్ ప్రిపరేషన్ కు టైమ్ సరిపోదు.
- వేద సంహిత్ గౌడ్, 10వ తరగతి, కొల్చారం, మెదక్ జిల్లా
టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కు నష్టం
టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ను ఎంకరైజ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ టీ ఎస్ ఈ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల స్టూడెంట్స్ నష్టపోతారు. స్టేజ్ -2 కు ఇంకా రెండు నెలల టైమే ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్టేజ్ -1 పరీక్ష నిర్వహించి స్టూడెంట్స్ నష్టపోకుండా చూడాలి.
- వి.నగేష్, పేరెంట్, మెదక్
