
- సివిల్ సప్లై, ఎఫ్సీఐ ఆఫీసర్లతో తనిఖీలకు ఆదేశాలు
- భారీ మొత్తంలో బియ్యం పక్కదారి పట్టినట్లు అనుమానాలు
- ఎక్కడ దొరికిపోతామో అన్న ఆందోళనలో మిల్లర్లు
మంచిర్యాల, వెలుగు : ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ గడువును పొడిగించిన ప్రభుత్వం.. ఇప్పటివరకు ఇచ్చిన బియ్యం, మిల్లుల్లో ఉన్న స్టాక్ వివరాలు తేల్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సివిల్ సప్లై, ఎఫ్సీఐ ఆఫీసర్లతో ఓ టీమ్ను ఏర్పాటు చేసి జాయింట్ ఫిజికల్ వెరిఫికేషన్ (జేపీవీ) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6 లోగా మిల్లుల్లో తనిఖీలు చేసి.. ఇప్పటివరకు ఎంత బియ్యం డెలివరీ చేశారు, మిల్లుల్లో ఇంకా ఎంత ఉండాలి ? ప్రస్తుతం స్టాక్ ఎంత ఉంది ? అనే వివరాలు సేకరించాలని ఆదేశించింది. తర్వాత మిల్లుల వారీగా రిపోర్ట్ను తయారు చేసి 7వ తేదీన సబ్మిట్ చేయాలని సివిల్ సప్లై ఇన్చార్జి కమిషనర్ ముజమ్మీల్ఖాన్ ఆఫీసర్లకు సూచించారు. సీఎంఆర్ గడువు పొడిగింపుపై మిల్లర్లు సంతోషంగానే ఉన్నా.. తనిఖీలు చేయాలన్న ఆదేశాలతో టెన్షన్ మొదలైంది. వెరిఫికేషన్లో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
బియ్యం అమ్ముకున్న మిల్లర్లు
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను రైస్గా మార్చి ఇచ్చేందుకు మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి క్వింటాల్ వడ్లకు 67 కిలోల చొప్పున రైస్ చొప్పున తిరిగి ప్రభుత్వానికి అందించాలి. కానీ చాలా మంది మిల్లర్లు బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సకాలంలో సీఎంఆర్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం పలుమార్లు సీఎంఆర్ గడువు పొడిగించినప్పటికీ మిల్లర్లు మాత్రం పూర్తి స్థాయిలో బియ్యం ఇవ్వడం లేదు. సీఎంఆర్ ఇవ్వని వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని వార్నింగ్ ఇచ్చినా లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.
గత ఖరీఫ్ సీజన్కు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని 30 మిల్లులకు 78,876 టన్నుల వడ్లను కేటాయించారు. వీటిని మిల్లింగ్ చేసి 53,120 టన్నుల బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ జూన్ 29 వరకు 32,891 టన్నులు మాత్రమే డెలివరీ చేయగా... ఇంకా 20,229 టన్నుల సీఎంఆర్ పెండింగ్లో ఉంది. ఈ లెక్కన మిల్లుల్లో 30,001 టన్నుల వడ్లు నిల్వ ఉండాలి. కానీ చాలా మిల్లుల్లో ఆ మేరకు స్టాక్ లేదని తెలుస్తోంది. జైపూర్ మండలంలోని ఓ మిల్లులో సీఎంఆర్ బకాయిలు పేరుకుపోవడంతో ఆర్ఆర్ యాక్ట్ నమోదు చేశారు. రూ.19 కోట్ల విలువైన సీఎంఆర్ పెండింగ్లో ఉన్నప్పటికీ... గత సీజన్లో ఆఫీసర్లను మేనేజ్ చేసి వడ్లు దించుకున్నారు. ప్రస్తుతం ఆ మిల్లులో సగం స్టాక్ కూడా లేదని సమాచారం. అలాగే హాజీపూర్ మండలంలోని మరో రెండు మిల్లులు కూడా రూ.25 కోట్లకు పైగా సీఎంఆర్ బకాయిలు ఉన్నాయి. సివిల్ సప్లై ఆఫీసర్లు పది రోజుల కింద మిల్లుల్లో తనిఖీలు చేసి వడ్లు తక్కువగా ఉన్నాయని గుర్తించినప్పటికీ విషయం బయటకు పొక్కకుండా తొక్కి పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రెండేండ్లలో సుమారు రూ.150 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయాయి. సంబంధిత మిల్లులపై ఆఫీసర్లు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవడం మినహా బకాయిల వసూళ్ల కోసం చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.