త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ ఎగ్జామ్‌‌ రిజల్ట్స్‌‌

త్వరలో వైద్య, ఆరోగ్య శాఖ ఎగ్జామ్‌‌ రిజల్ట్స్‌‌
  • హైదరాబాద్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌‌ ముగియగానే ఫలితాలు
  • గతేడాది 6 వేల పోస్టులకు పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని పలు పరీక్షల ఫలితాలను ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌‌ ముగియగానే ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. దాదాపు 6 వేలపైగా పోస్టులకు గతంలో పరీక్షలు నిర్వహించగా, హైదరాబాద్‌‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలుతో ఫలితాలు నిలిచిపోయాయి. కోడ్‌‌ ముగియగానే ఈ నెల చివర్లో, లేదా మే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సర్కార్‌‌‌‌ రెడీ అవుతున్నది.

 కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన పనిచేస్తున్న వారు కూడా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని పలు పోస్టులకు పరీక్షలు రాశారు. వీరికి అదనంగా 20 వేయిటేజీ మార్కులు కేటాయించనున్నారు. ట్రైబల్ ఏరియాల్లో 30 వేయిటేజి మార్కులు యాడ్ చేయనున్నారు. వేయిటేజీ మార్కులు పొందే అభ్యర్థులు ఎక్స్‌‌పీరియన్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమవుతున్నదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 భవిష్యత్‌‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా సర్టిఫికేట్లను వెరిఫై చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీనికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఫలితాల ఆలస్యానికి మరో కారణంగా పేర్కొంటున్నారు. ఏప్రిల్ 29న కోడ్ ముగిశాక ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. 

ఉద్యోగాల్లో చేరనున్న 6,218 మంది..

వైద్య, ఆరోగ్య శాఖలో వైద్య, వైద్య అనుబంధ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు రకాల ఉద్యోగాలకు ఐదు నెలల క్రితం పరీక్షలు నిర్వహించారు. గత నవంబర్, డిసెంబర్‌‌‌‌లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2,300 నర్సింగ్ ఆఫసర్ల పోస్టులు, 633 ఫార్మసిస్టు పోస్టులు, 1,930 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,147 పోస్టులకు సంబంధించి లక్ష మందికి పైగా అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, వచ్చే నెలలో మెడికల్‌‌ కాలేజీల్లో అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.