
- పెండింగ్ పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు
- ఇందిరమ్మ ఇండ్ల ఎల్ 2 లిస్ట్ నుంచి లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు
- వారికే నిధులు ఇచ్చి ఇండ్లు పూర్తి చేయించేలా ప్లాన్
కరీంనగర్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయి, నిరుపయోగంగా మారిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా పెండింగ్ వర్క్స్ కోసం కావాల్సిన నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో.. లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చూడాలని, ఆ మేరకు వారి అకౌంట్లలోనే బిల్లులు జమ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్ల పనులు ఎక్కడెక్కడ, ఎంత మేరకు పెండింగ్లో ఉన్నాయి..
వాటిని పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరం అవుతాయన్న లెక్కలు తీసే పనిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన చోట వారి ఇండ్లకు సంబంధించిన పెండింగ్ వర్క్స్కు నిధులు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతానికి పైగా పూర్తయిన ఇండ్లు 36 వేలకు పైగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. వాటిని నిరుపేదలకు పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
ఇండ్ల స్థలాల్లేని వారికి డబుల్ ఇండ్లు
ఏడెనిమిదేండ్ల కింద బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ ఇండ్లు, ఫ్లాట్లను పంపిణీ చేయకపోవడంతో చాలా చోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రజాపాలన సభల్లో తమకు సొంతిల్లు, ఇంటి స్థలం లేదని అప్లై చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలను గుర్తించి.. వారికి ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొంత స్థలం లేని పేదలు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో లబ్ధిపొందే అవకాశం లేనందున ఎల్2లో ఉన్న వారిని గుర్తించాలని ఆఫీసర్లకు సూచించింది.
ఇందులో ఇల్లు లేనివారుగానీ, గుడిసెవాసులు గానీ పిల్లలు ఉన్న వితంతువులు గానీ సఫాయి కర్మాచారి లేదా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధానాన్నే డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ అనుసరించాలని, ఈ ఎంపికను గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ముగిశాక డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు అలాట్మెంట్ ఆర్డర్స్ జారీ చేనున్నారు. ఈ ప్రక్రియ కోసం ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్లోనే ప్రత్యేక మాడ్యుల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
పంపిణీకి సిద్ధంగా 36 వేల ఇండ్లు
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2,30,320 డబుల్ బెడ్రూం ఇండ్లు సాంక్షన్ చేయగా.. ఇందులో 1,60,705 ఇండ్లను మాత్రమే పూర్తి చేశారు. వీటిలో కూడా 1,36,116 మందికి పట్టాలను పంపిణీ చేశారు. మరో 36,538 ఇండ్ల నిర్మాణ పనులు 80 శాతం నుంచి 90 శాతం పూర్తయ్యాయి. ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, పెయింటింగ్ వంటి చిన్న చిన్న పనులే పెండింగ్లో ఉన్నాయి. ఈ పనులను పూర్తి చేసేందుకు రూ.182 కోట్లు కేటాయించి.. టెండర్లు పిలువగా చాలా చోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో లబ్ధిదారులను ఎంపిక చేశాక.. వారికే నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసుకునేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కరీంనగర్ జిల్లాలో 1,227 ఇండ్ల పనులు 90 శాతం పూర్తయినా లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. అలాగే నిజామాబాద్ జిల్లాలో 6 వేల ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే మరో 33 వేల ఇండ్లు పునాది, పిల్లర్లు, స్లాబ్ దశలోనే ఆగిపోయాయి. వీటిని పూర్తి చేస్తారా ? లేదా ? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.