బీసీ రిజర్వేషన్లపై రేపే(సెప్టెంబర్ 26) జీవో.?..29న లోకల్‌‌ బాడీ ఎలక్షన్స్‌‌కు షెడ్యూల్ .!

బీసీ రిజర్వేషన్లపై రేపే(సెప్టెంబర్ 26) జీవో.?..29న లోకల్‌‌ బాడీ ఎలక్షన్స్‌‌కు షెడ్యూల్ .!
  • 27న పొలిటికల్ పార్టీలతో జిల్లాల్లో మీటింగ్.. 28న రిజర్వేషన్ల గెజిట్ 
  • ప్రచురించేలా ఏర్పాట్లు
  • 29న లోకల్‌‌ బాడీ ఎలక్షన్స్‌‌కు షెడ్యూల్ ప్రకటించే చాన్స్​​
  • పకడ్బందీగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు 

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ నెల  26 న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసింది. 26న రాత్రి జిల్లా కలెక్టర్లకు జీవోను పంపనున్నట్లు సమాచారం. ఆ వెంటనే 27న పొలిటికల్​ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్‌‌లు ఏర్పాటు చేసి, రిజర్వేషన్లను పబ్లిష్​ చేసేలా ప్లాన్ చేస్తున్నది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌‌ను ప్రచురించి ఈ నెల 28వ తేదీ కల్లా  రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనున్నది.  ఆ మరుసటి రోజు 29న  రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్​ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌‌ను ప్రకటించే అవకాశం ఉన్నది. రిజర్వేషన్ల గెజిట్​ ప్రచురించేంత వరకు అప్రమత్తంగా ఉండాలని,  ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ప్లాన్​ చేసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్‌‌రెడ్డి  ఆదేశించినట్లు తెలిసింది.   ఇదిలా ఉండగా.. ఇప్పటికే పోలింగ్ అధికారులు (పీవోలు), సహాయ పోలింగ్ అధికారుల (ఏపీవోలు) కు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ నెల 26, 27వ తేదీల్లో ట్రైనింగ్​ క్లాసులు  జరపాలని  జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శిక్షణ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎలాంటి సెలవులకు అనుమతి ఉండదని జిల్లాల కలెక్టర్లు తెలిపారు. హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.

డెడికేటెడ్‌‌​ కమిషన్​ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు.. అదే జీవో

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు పక్కా ప్లాన్‌‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందుకోసం డెడికేటెడ్​ కమిషన్​ నివేదికను ఆధారంగా చేసుకున్నట్లు స్పష్టం చేయనున్నది. గతంలో జీవోతోనే చేసిన ఎస్టీల రిజర్వేషన్ల పెంపును పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.  ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్​ చట్టం –2018కు సవరణ చేసిన గెజిట్‌‌ను ప్రచురించింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేటెడ్​ కమిషన్..​ ఎంపిరికల్​ డేటాను విశ్లేషించి.. రిజర్వేషన్ల పై నివేదిక ఇస్తుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తుంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ , ఒకవేళ బీసీలకు సంబంధించి ఉన్న వెనకబాటు ఎంపిరికల్​ డేటాఉంటే రిజర్వేషన్లు పెంచుకునే దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక జీవోను బీసీ శాఖ ఇవ్వనున్నది. దానిని పంచాయతీరాజ్​ శాఖ అడాప్ట్​ చేసుకొని, రిజర్వేషన్ల గెజిట్​ ప్రచురిస్తుందని సెక్రటేరియెట్​ వర్గాలు వెల్లడించాయి.