గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్ల సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం

గుడ్ న్యూస్.. గిగ్ వర్కర్ల సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం
  •  
  • కనీస వేతనం, ఆరోగ్య, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు 
  • పీఎఫ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలపైనా దృష్టి 
  • ముసాయిదా బిల్లు సిద్ధం.. వచ్చే అసెంబ్లీ సెషన్‌‌లో ఆమోదం
  • 5 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిగ్ వర్కర్లు, వాళ్ల కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురానుంది. గిగ్ వర్కర్లకు కనీస వేతనం, ఆరోగ్య, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. వాళ్ల కోసం ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లు రూపకల్పన తుది దశకు చేరుకుంది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించాలని సర్కార్ యోచిస్తున్నది. ఈ చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో ఉన్న దాదాపు 5 లక్షల మంది గిగ్ వర్కర్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 

ఉద్యోగ, సామాజిక భద్రత 

గిగ్ వర్కర్లకు ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఆ నిధి ద్వారా గిగ్ వర్కర్లకు ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించడంతో పాటు వాళ్ల పిల్లల చదువులకు ఆర్థిక సాయం అందించాలని యోచిస్తున్నది. ఆరోగ్య బీమా కింద గిగ్ వర్కర్లతో పాటు వాళ్ల కుటుంబసభ్యులకు వైద్య సేవలు అందించాలని.. దురదృష్టవశాత్తు గిగ్ వర్కర్ ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబానికి రైతు బీమా మాదిరి ప్రమాద బీమా కింద పరిహారం అందజేయాలని ఆలోచన చేస్తున్నది.  మహిళా గిగ్ వర్కర్లు ఉన్నట్లయితే ప్రసూతి ప్రయోజనాలు కూడా కల్పించాలని యోచిస్తున్నది. 

కనీస వేతనం.. నిర్దిష్ట పని గంటలు

గిగ్ వర్కర్లకు ప్రస్తుతం నిర్దిష్టమైన పని గంటలు లేవు. ఎవరికి వాళ్లు ఆయా సమయాల్లో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌లలో పని చేస్తున్నారు. దీంతో పని గంటలు, విశ్రాంతి సమయాలను నిర్ధారించడానికి చట్టంలో గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ ఇవ్వనున్నారు. అదే సమయంలో గిగ్ వర్కర్లకు కనీస వేతనం లేదా కనీస పని ఆధారిత చెల్లింపును నిర్ధారించనున్నారు. ఒక్కో సమయంలో ఒక్కో అమౌంట్ కాకుండా పారదర్శకంగా చెల్లింపులు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. దీంతో వర్కర్ల శ్రమకు సరైన వేతనం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇది వారికి ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలను కూడా కల్పించనుంది. అలాగే ఒక నిర్దిష్ట కాలం పాటు పని చేసిన గిగ్ వర్కర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కోసం పెన్షన్‌‌‌‌‌‌‌‌లా కొంత మొత్తం సాయమందించడంపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.
 
ప్రత్యేక నిధి ఏర్పాటు 

గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి అగ్రిగేటర్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌ తమ బిల్లింగ్‌‌‌‌‌‌‌‌లో కొంత శాతాన్ని (ఉదాహరణకు 1% నుంచి 2%) ఈ నిధికి విధిగా చెల్లించేలా నిబంధనలు తేనుంది. లేదంటే వినియోగదారుల నుంచి వసూలు చేసే ప్రతిపాదననూ పరిశీలిస్తున్నది. ప్రభుత్వం  కూడా ఈ నిధికి నిధులు సమకూరుస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులను కూడా దీనికి మళ్లించే అవకాశం ఉంది.  

స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనింగ్ 

గిగ్ వర్కర్లు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి,  కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇది వారికి మెరుగైన ఉపాధి అవకాశాలను పొందడంలో సహాయపడనుంది. కొత్త టెక్నాలజీ,  మార్కెట్ అవసరాలకు అనుగుణంగా గిగ్ వర్కర్లు తమ నైపుణ్యాలను అప్‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది.

వివాదాల పరిష్కారానికి వేదిక 

గిగ్ వర్కర్లు, అగ్రిగేటర్ల మధ్య తలెత్తే వివాదాలను (చెల్లింపులు ఆపడం, అకౌంట్ బ్లాకింగ్‌‌‌‌‌‌‌‌ వంటి సమస్యలు) పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాంగం పారదర్శకంగా సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించి, గిగ్ వర్కర్లకు న్యాయం జరిగేలా చూస్తుంది. ఇది గిగ్ వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదిక కానుంది. గిగ్ వర్కర్ల హక్కులను రక్షించడంతో పాటు వాళ్లపై అగ్రిగేటర్లు ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా నిబంధనలు రూపొందించనున్నారు. ఈ ముసాయిదా బిల్లు చట్ట రూపం దాల్చితే రాష్ట్రంలోని లక్షల మంది గిగ్ వర్కర్ల జీవితాల్లో మార్పులు రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.