విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా.. శాశ్వత అంగ వైకల్యానికి రూ.80 లక్షలు

విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా.. శాశ్వత అంగ వైకల్యానికి రూ.80 లక్షలు
  • నలుగురు కుటుంబసభ్యులకు కూడా రూ.20 లక్షల వరకు బీమా సౌకర్యం 
  • ఎస్‌‌బీఐతో ప్రభుత్వం ఒప్పందం 
  • ఈ బీమా పథకం చిరస్థాయిలో నిలిచిపోతుంది: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త బీమా పథకం తీసుకొచ్చింది. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే, బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారంగా అందనుంది. ఒకవేళ ఉద్యోగి శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.80 లక్షలు అందుతుంది. సహజ మరణమైతే రూ.10 లక్షలు ఇస్తారు. అదే విధంగా ఉద్యోగి కుటుంబంలోని నలుగురు సభ్యులకు కూడా రూ.20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ మేరకు ఎస్‌‌బీఐతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ప్రజాభవన్‌‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో విద్యుత్ సంస్థలతో ఎస్‌‌బీఐ ఒప్పందం చేసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ.. ఈ బీమా పథకం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

దీని ద్వారా విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 51,868 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ‘రాత్రీ -పగలు పని చేస్తూ, ప్రకృతి వైపరీత్యాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించే విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం ఈ పథకం తీసుకొచ్చాం. లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్ నుంచి సీఎండీ స్థాయి వరకు అందరికీ ఈ బీమా భరోసా కల్పిస్తుంది. ఈ పథకం ఉద్యోగుల్లో మనోధైర్యం, ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. ఉద్యోగుల నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండానే దీన్ని అమలు చేస్తున్నాం. ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న విద్యుత్ ఉద్యోగులకు ఈ ప్రమాద బీమాతో పాటు విద్య, వివాహ రుణాలు కూడా ఇస్తున్నాం” అని భట్టి విక్రమార్క తెలిపారు.  

గ్రీన్ ఎనర్జీకి ప్రణాళికలు..
ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నామని భట్టి తెలిపారు. ‘‘2023తో పోలిస్తే 2025లో పీక్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరింది. ఈ వేసవిలో 2 వేల మెగావాట్ల అదనపు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చినా రెప్పపాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేశాం. గ్రీన్ ఎనర్జీ కోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. గత పదేండ్లుగా ప్రత్యేక విద్యుత్ పాలసీ లేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడిపోయాం. అందుకే మా ప్రభుత్వం ఏర్పడగానే  గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చాం. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం” అని చెప్పారు.

రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని.. ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ మారుతున్నదని పేర్కొన్నారు. తాను 1990లో బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న సమయంలో విద్యార్థులు, రైతుల కోసం ఎడ్యుకేషన్ లోన్, కిసాన్ క్రెడిట్ కార్డును ఇచ్చినట్లు చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ ​సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు  
రూ.కోటి ప్రమాద బీమా కల్పించడంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను జేఏసీ ప్రతినిధుల బృందం కలిసి కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సాయిబాబా, రత్నాకర్ రావు, పరికి సదానందం, శ్యామ్ మనోహర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.