
- కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
హైదరాబాద్, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా, ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఆవులపల్లి రిజర్వాయర్ పనులు అడ్డుకోవాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. ఇరిగేషన్ఈఎన్సీ (జనరల్) మురళీధర్.. కేఆర్ఎంబీ చైర్మన్ శివ్నందన్ కుమార్కు గురువారం లెటర్ రాశారు. గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి లింకింగ్ స్కీమ్లో భాగంగా ఏపీలోని చిత్తూరు జిల్లా సోమాల మండలం ఆవులపల్లిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారని తెలిపారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, ఫారెస్ట్ క్లియరెన్స్ సహా ఇతర అనుమతులు కూడా లేవని, ఈ పనులను వెంటనే నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చిందని లేఖలో గుర్తు చేశారు. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు ఈ ప్రాజెక్టుల కారణంగా పర్యావరణంపై పడే ప్రభావం, పబ్లిక్ హియరింగ్ నిర్వహించి తుది అనుమతులు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించిందన్నారు.
నిబంధనలు అతిక్రమించి ఈ మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నందుకు ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీ వద్ద రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని కూడా ఎన్జీటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసిందన్నారు. ఎన్జీటీ ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని, రూ.100 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలపై కోర్టు స్టే ఇచ్చిందని, అయితే కేఆర్ఎంబీ వద్ద ఎనిమిది వారాల్లోగా రూ.25 కోట్లు డిపాజిట్చేయాలని ఆదేశించిందని తెలిపారు. అయినా, ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను అతిక్రమించి ఆవులపల్లి రిజర్వాయర్ నిర్మాణం కొనసాగిస్తున్నదన్నారు. కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ సహా ఇతర అనుమతులు వచ్చే వరకు ఈ రిజర్వాయర్ పనులు నిలిపివేయించాలని కోరారు.