
- హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన డివిజన్ బెంచ్
- టీఎస్పీఎస్సీ ఇచ్చిన లెక్కల్లో 258 మంది సంఖ్య ఎట్ల పెరిగింది?
- వాళ్లు అక్రమదారిలో గ్రూప్ 1కు సెలెక్ట్ అయితే పరిస్థితి ఏంది?
- కమిషన్ తీరు వల్ల మెరిట్ అభ్యర్థులకు నష్టం జరిగే ప్రమాదం
- రాజ్యాంగ సంస్థ అని చెప్తున్నరు.. మరి, రూల్స్ ఎందుకు ఫాలో కాలేదని ఫైర్
- టీఎస్పీఎస్సీ అప్పీల్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు కరెక్టేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. పరీక్షను క్యాన్సిల్ చేస్తూ ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఎగ్జామ్ నిర్వహణలో టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు రూల్స్ను తప్పకుండా పాటించాల్సిందేనని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోవాల్సిందేనని చెప్పింది. తొలిసారి (గత ఏడాది అక్టోబర్ 16న) ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ అమలు చేశారని, ఆ పేపర్ లీకేజీతో పరీక్షను రద్దు చేసి తిరిగి జూన్ 11న నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.
కమిషన్ నిర్లక్ష్యం వల్ల ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే అవకాశాలు లేకపోలేదని చెప్పింది. టీఎస్పీఎస్సీ తీరు అనుమానాలకు తావిచ్చినట్లుందని అభిప్రాయపడింది. ఒకవేళ రెండోసారి పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోవద్దనుకుంటే నోటిఫికేషన్ రూల్స్ సవరిస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాల్సిందని, అలా చేయకపోవడం చట్ట వ్యతిరేకమని డివిజన్ బెంచ్ పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ జూలకంటి అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
లెక్కల్లో అభ్యర్థుల సంఖ్య ఎట్ల పెరిగింది?
గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ తర్వాత 2,33,248 మంది పరీక్షకు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ చెప్పిన లెక్కలకు.. 2,33,506 మంది అని వెబ్నోట్లో పేర్కొన్న లెక్కలకు మధ్య చాలా తేడా ఉందని డివిజన్ బెంచ్ తెలిపింది. ఏకంగా 258 మంది అభ్యర్థులు ఎక్కువగా ఉండటం ఏమిటని కమిషన్ను ప్రశ్నించింది. ఇదీ అనుమానాలకు తావిస్తున్నదని , ఈ పరిస్థితుల్లో అక్రమ దారిలో 258 మంది ప్రిలిమ్స్లోనే కాకుండా గ్రూప్ 1 పోస్టులకు కూడా ఎంపికైతే ఆ మేరకు ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొంది. ‘‘లక్షల మంది పోటీపడే ఇలాంటి పరీక్షల్లో నిర్లక్ష్యం వల్ల మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వాళ్ల జీవితకాల లక్ష్యం నాశనమవుతుంది.
ప్రతిభావంతులైన అభ్యర్థులు జీవితాంతం నష్టపోయినట్లే అవుతుంది” అని కమిషన్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్ష కాబట్టి ఆ సంఖ్యను పట్టించుకోనక్కర్లేదన్న కమిషన్ వాదన కరెక్ట్ కాదని, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన తర్వాత సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారమే కనిపించడం లేదని స్పష్టం చేసింది. అందుకే కమిషన్ దాఖలు చేసిన అప్పీల్ను
కొట్టివేస్తున్నామని తీర్పులో పేర్కొంది.
కమిషన్పై అభ్యర్థుల్లో నమ్మకం తగ్గుతున్నది
‘‘గత ఏడాది అక్టోబర్లో తొలిసారి పరీక్ష నిర్వహించినప్పుడు బయోమెట్రిక్ అమలు చేశారు. అప్పుడు 2,85,968 మంది హాజరయ్యారు. వాళ్లందరికీ బయోమెట్రిక్ తీసుకున్నారు. పేపర్ లీకేజీ కారణంగా గత జూన్ 11న రెండోసారి నిర్వహించిన పరీక్షకు 2,33,506 మంది హాజరైనప్పుడు బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు. రెండోసారి పరీక్షకు 50 వేల మంది హాజరుకాకపోవడం చిన్న విషయం కాదు.
అభ్యర్థులకు కమిషన్పై విశ్వసనీయత సన్నగిల్లినట్లున్నది. అవకతవకలు జరిగాయని చెప్పడానికి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య తగ్గడమే నిదర్శనం” అని హైకోర్టు డివిజన్ బెంచ్ తన తీర్పులో తెలిపింది. కానిస్టేబుల్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు గ్రూప్ 1కు తీసుకోకపోవడానికి చెప్తున్న సాంకేతిక కారణాలు సమర్థనీయంగా లేవని మండిపడింది. ‘‘నోటిఫికేషన్ నిబంధనలకు కచ్చితంగా కమిషన్, అభ్యర్థులు కట్టుబడి ఉండాలని తమిళనాడు వర్సెస్ హేమలత కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఈ తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. ఓఏంఆర్ షీట్లపై నామినల్ రోల్స్ తనిఖీకి ఇద్దరు ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండాలన్న నిబంధనను కమిషన్ ఒక్కరితోనే సరిపెట్టడం ఉల్లంఘనే. ఒక నిర్దిష్ట విధానాన్ని అమలు చేయలేదని కమిషన్ సమాధానమే తెలియజేస్తున్నది. కొన్ని ఓఎంఆర్ షీట్లపై ఒక్క ఇన్విజిలేర్ సంతకమే ఉంది” అని పేర్కొన్నారు. సుమారు ఏడు లక్షల మంది పరీక్ష రాసిన గ్రూప్ 4కు ఓఎంఆర్ షీట్లపై అభ్యర్థుల ఫొటో ఇచ్చిన కమిషన్ మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు ఇవ్వకపోవడం ఏందని ప్రశ్నించారు. ఈ లోపాలన్నీ బేరీజు వేశాక పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారని, అందులో జోక్యం చేసుకోవడం కుదరని స్పష్టం చేసింది.
సర్వీస్ కమిషన్ చర్యలు లోపభూయిష్టం: పిటిషనర్లు
‘‘గ్రూప్ 4 పరీక్ష అయిపోగానే 7,62, 872 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రాథమిక సమాచారంగా చెప్పిన సర్వీస్ కమిషన్.. ఆ తర్వాత ఆ సంఖ్య 7,63,835గా ప్రకటించడాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలి” అని పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్ ఎ. గిరిధర్రావు అన్నారు. గ్రూప్ 1పై తాము పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే కమిషన్ కండ్లు తెరిచిందని, గ్రూప్ 4 నోటిఫికేషన్లో బయోమెట్రిక్ తీసుకోబోమని సవరణ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. ‘‘మేం గ్రూప్ 1పై పిటిషన్ దాఖలు చేయకపోతే గ్రూప్ 4 నోటిఫికేషన్ను కమిషన్ సవరణ చేసుండేది కాదు. సర్వీస్ కమిషన్కు చిత్తశుద్ధి లోపించింది.
ఒకసారి గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన తర్వాత కూడా రెండోసారి నిబంధనలకు తగ్గట్టుగా నిర్వహించలేదు” అని కోర్టు దృష్టికి తెచ్చారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కనుక రద్దు చేస్తే అక్రమ మార్గంలో వచ్చిన 258 మంది అభ్యర్థులు మెయిన్స్, ఆపై ఇంటర్వ్యూలను కూడా దాటుకుని గ్రూప్ 1 పోస్టులను వశం చేసుకుంటే వచ్చే నష్టాన్ని పరిగణించాలని కోరారు.
గ్రూప్ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యపై కమిషన్ రెండుసార్లు ఇచ్చిన వివరాలను పరిశీలిస్తే 258 మంది ఎక్కువగా కనిపిస్తున్నారని, అదనంగా వచ్చిన ఆ 258 మంది ఎవరన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత డివిజన్ బెంచ్.. టీఎస్పీఎస్సీ అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. నోటిఫికేషన్ నిబంధనలకు తగ్గట్టుగా, పకడ్బందీగా మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించాలని తీర్పు చెప్పింది.
రాజ్యాంగ సంస్థ అయితే రూల్స్ను ఎందుకు ఫాలో కాలే?
అప్పీల్ పిటిషన్పై రెండోరోజు బుధవారం గంటకుపైగా వాదనలు జరిగాయి. సర్వీస్ కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కేవలం ముగ్గురు అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని కోరారని, వారి వాదనను సింగిల్ జడ్జి ఆమోదించడాన్ని రద్దు చేయాలని అన్నారు. పరీక్ష సమర్థవంతంగా నిర్వహించలేదని ఎవ్వరూ అనలేదని, అక్రమాలు జరిగాయని కూడా చెప్పలేదని పేర్కొన్నారు. మంగళవారం హైకోర్టు ఆదేశించిన మేరకు కమిషన్ తరఫున ఏజీ వివరాలను డివిజన్ బెంచ్కు నివేదించారు. కమిషన్ రాజ్యాంగ సంస్థ కాబట్టి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిపారు. రాజ్యాంగ సంస్థ అయితే, నోటిఫికేషన్లోని రూల్స్కు తగ్గట్టుగా పరీక్ష ఎందుకు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించింది. అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని అభిప్రాయపడింది.