కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పరీక్షలు ఎవరికి చేస్తున్నారో మే 13లోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. అలాగే లాక్ డౌన్ వేళ దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దివ్యాంగులకు, వారి సహాయకులకు పాస్ లు ఇవ్వాలని సూచించింది హైకోర్టు. నిత్యావసరాలు, ఔషధాలు దివ్యాంగుల ఇళ్లకు సరఫరా చేయాలని.. సేవాభావం ఉన్న ఎన్ జీఓలు, కార్పొరేట్ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని తెలిపింది.
దివ్యాంగులకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లను విస్తృత ప్రచారం చేయాలని.. లాక్ డౌన్ సమయంలో దివ్యాంగుల అత్యవసర చికిత్సలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పింది. జిల్లా సంక్షేమ అధికారులు దివ్యాంగుల వివరాలు సేకరించి, వారి బాగోగలు చూసుకోవాలన్న హైకోర్టు.. ఏం చర్యలు తీసుకున్నారో మే 8లోగా నివేదిక సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను మే 8కి వాయిదా వేసింది హైకోర్టు.