
- స్టేట్ వృద్ధి రేటు 10.1%.. దేశ సగటును మించి నమోదు
- ప్రతి భాగస్వామ్యం లావాదేవీ కాదు.. అది ఒక మార్పు అని వెల్లడి
- గ్లోబల్ లీడర్స్ సమిట్లో మంత్రి ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్మోడల్గా నిలుస్తున్నదని ఐటీ, ఇండస్ట్రీస్శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, కలిసి పనిచేసేందుకు కలిసి రావాలని వివిధ దేశాల ప్రతినిధులను ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్ (ఐబీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్స్సమిట్–2025’ను శ్రీధర్ బాబు ప్రారంభించి మాట్లాడారు. మొదట్లో చాలామంది తెలంగాణ ఏర్పాటు అసాధ్యమన్నారని.. కానీ రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ‘తెలంగాణ అన్స్టాపబుల్’ అనే స్థాయికి ఎదిగిందన్నారు.
రాష్ట్ర జీడీపీ రూ.16.12 లక్షల కోట్ల కు చేరిందని చెప్పారు. 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటు వృద్ధి రేటు (9.9%)ను దాటేసిందని పేర్కొన్నా రు. ‘‘రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు. ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువ. ఏడాదిన్నర కాలం లోనే రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకు రాగలిగాం. గత 14 నెలల్లో లైఫ్ సైన్సెస్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులను సాధించాం. 2 లక్షల ఉద్యోగా లు సృష్టించాం. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం. దేశంలో ఇది 55 శాతంగా ఉంది. ఇవి అంకెలు కాదు.. తెలంగాణ పురోగతికి నిదర్శనాలు’’ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మరో అడుగు ముందుకు..
ప్రతి భాగస్వామ్యం ఒక లావాదేవీ కాదని, అది ఒక మార్పు అని శ్రీధర్ బాబు చెప్పారు. అందుకే అంతర్జాతీయ భాగస్వామ్యాలతో తెలంగాణ పురోగతిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆగ్రో ఇన్నోవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, డిజిటల్ ఫార్మింగ్, ఫ్యూచర్ – రెడీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ మాన్యుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ తదితర అంశాల్లో ప్రపంచ దేశాలతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మిగిలిన రాష్ట్రాలు ట్రెండ్ను అనుసరిస్తే.. తెలంగాణ మాత్రం ట్రెండ్ను సృష్టిస్తున్నదన్నారు.
ఇక్కడ కేవలం పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే రావొద్దని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములయ్యేలా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బ్రెజిల్, జర్మనీ, రష్యా, కామెరూన్, మాల్టా, బ్రిటన్, బల్గేరియా, బెల్జియం, యూఏఈ, దుబాయ్ తదితర 25 దేశాల ప్రతినిధులు ఒకే వేదిక పైకి రావడం శుభపరిణామమన్నారు.
ఇది ఒక సదస్సుగా మిగిలిపోకుండా వివిధ దేశాల మధ్య సంస్కృతి, వ్యూహాలు, టెక్నాలజీ బదలాయింపునకు వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను ఆయా దేశాల్లోని పారిశ్రామిక వేత్తలకు వివరించాలన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించాలని ఆయా దేశాల ప్రతినిధులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిప్లోమేటిక్ రిలేషన్స్(ఐవోడీఆర్) మాల్టా గవర్నర్ లిల్లో మర్రా, కార్యదర్శి మార్సెల్లో పట్టి, బెల్జియం ఎంపీ ఇవాన్ పెట్రోవ్, జర్మనీ డిప్లోమాట్ డానియల్ జెర్బిన్, అర్జెంటీనా ఎంపీ క్లాడియో సింగోలనీ, ఐబీసీ చైర్మన్ సాల్మన్ గట్టు, డైరెక్టర్ గ్లోరియా సుహాసిని పాల్గొన్నారు.