
- స్వచ్ఛదనం పేరుతో కొత్త ఆప్షన్
- చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్కు తరలింపుపై నిఘా
- వారం పది రోజుల్లో అందుబాటులో యాప్
- ఎప్పటికప్పుడు చెత్త సేకరణ వివరాలు అప్లోడ్
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో చెత్త సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. గ్రామపంచాయతీల్లో నిర్వహించే పారిశుధ్య కార్యక్రమాలను ప్రతి రోజూ ప్రత్యేక యాప్ ద్వారా ఆఫీసర్లు మానిటరింగ్ చేయనున్నారు. ఏ గ్రామంలో ఎంత చెత్త సేకరిస్తున్నారు? ఆ చెత్తను ఏం చేస్తున్నారు? చెత్తను కాలుస్తున్నారా? డంపింగ్ యార్డులో కాకుండా రోడ్డుపక్కన పడేస్తున్నారా? అని తెలుసుకునేందుకు పీఎస్ యాప్ లో కొత్తగా ‘స్వచ్ఛదనం’ అనే ఆప్షన్ ను చేర్చారు. ఇది వారం పది రోజుల్లో అందుబాటులోకి రానున్నది.
ఇష్టమొచ్చిన చోట చెత్త డంపింగ్
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. పంచాయతీల్లో చెత్త సేకరణ ముందుకు సాగడం లేదు. సేకరించిన చెత్తను ఇష్టమొచ్చిన చోట డంప్ చేస్తున్నారు. ఆ చెత్తకు నిప్పు పెట్టడంతో గాలి కాలుష్యం అవుతున్నది. వర్షాకాలంలో చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డులు ఉన్నప్పటికీ అక్కడికి తరలించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టింది. పచ్చదనం పెంచే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నది. స్వచ్ఛ పల్లెలే లక్ష్యంగా కొత్త యాప్ కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తున్నది. యాప్ ద్వారా ప్రతి రోజు చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించడంతో గ్రామాల్లో పచ్చదనం పెరగనున్నది.
పీఎస్ యాప్ లో కొత్త ఆప్షన్ ‘స్వచ్ఛదనం’
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు ఇప్పటికే యాప్ ఉంది. పంచాయతీ కార్యదర్శులకు మొబైల్ ‘పీఎస్ యాప్’ను రూపొందించారు. అందులో పారిశుధ్య పనులు, చెత్త సేకరణ అంశాలు, పంచాయతీల నిర్వహణ వివరాలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేయాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్యదర్శలు సమాచారం అప్ లోడ్ చేస్తున్నారు. అయితే, ప్రతి రోజూ కాలువలు, వీధులను శుభ్రపరిచే సమాచారం, ఫొటోలు ఆ యాప్ లో అప్ లోడ్ చేస్తున్నప్పటికీ కొంత నిర్లక్ష్యం, జాప్యం జరుగుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
దీంతో ప్రభుత్వం అదే పీఎస్ యాప్ లో మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వేస్ట్ కలెక్షన్ మేనేజ్మెంట్ కోసం అదనంగా ‘స్వచ్ఛదనం’అనే ఆప్షన్ చేర్చారు. ప్రతి రోజూ గ్రామంలో ఎన్ని ఇండ్ల నుంచి చెత్త సేకరించారు? ఎంత మేర చెత్త పోగైంది? అందులో తడి, పొడి చెత్త వంటి సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శలు అప్లోడ్ చేయనున్నారు.
స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా మంత్రి సీతక్క ప్రణాళికలు
పారిశుధ్య నిర్వహణకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా అధికారులకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇస్తున్నారు. పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే పీఎస్ యాప్ లో ‘స్వచ్ఛదనం’ పేరుతో కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. చెత్తపై మానిటరింగ్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించే కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు
కార్యదర్శులు యాప్ లో అప్ లోడ్ చేసిన సమాచారాన్ని పర్యవేక్షించేందుకు అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. మండల స్థాయిలో కూడా ఒక అధికారికి మానిటరింగ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. సేకరించిన చెత్తను ఎక్కడో ఒక చోట పడేయకుండా చర్యలు తీసుకుంటున్నది. చెత్త సేకరించే వాహనానికి సైతం అవసరం అయితే జీపీఎస్ కూడా అమర్చబోతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో డంప్ చేయకుండా యార్డులకు తరలించాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఒక్కో వ్యక్తి కనీసం 100 గ్రాముల చెత్తను జనరేట్ చేస్తాడని అధికారులు అంచనా వేస్తున్నారు.
దానికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో అంత మేర చెత్త సేకరణ జరగకపోతే.. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేనట్లే అనేది స్పష్టమవుతుంది. అలాంటి సందర్భంలో పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేసి చేత్త సేకరణ ప్రక్రియను మరింత మెరుగుపర్చేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తది. తడి చెత్తను 60 రోజుల్లో ఎరువుగా మార్చాల్సి ఉంటుంది. కేజీ పొడి చెత్త 60 రోజుల్లో 150 గ్రాముల ఎరువుగా మారుతుంది. ప్లాస్టిక్, సీసాలు వంటి పొడి చెత్తను ప్లాస్టిక్ డిస్పోస్ కేంద్రాలకు తరలించాలి... లేకపోతే అమ్మేయాల్సి ఉంటుంది.