నగరంలో తొలి పోస్టాఫీసు... ?

నగరంలో తొలి పోస్టాఫీసు... ?

తెలంగాణ పోటీ పరీక్షల సిలబస్​లో వాస్తు నిర్మాణం, ప్రాచీన కట్టడాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వీటిపైనే అత్యధిక ప్రశ్నలు అడిగే ఆస్కారం  ఉంది. ముఖ్యంగా అసఫ్​జాహీల పాలనా కాలంలో పెద్ద ఎత్తున నిర్మాణాలను చేపట్టారు. ఎగ్జామ్​ పాయింట్​ ఆఫ్​ వ్యూలో కీలకమైన ఆరో నిజాం మీర్ మహబూబ్​ అలీఖాన్​ కాలంలో చేపట్టిన ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకుందాం. ​ 

మహబూబ్​ కళాశాల

రెజిమెంటల్​ బజార్​, జేమ్స్​ స్ట్రీట్​, కళాసిగూడ ప్రాంతాల్లో ఆంగ్లేయతరులు ఎక్కువగా నివసించేవారు. వీరికి తగిన విద్యావకాశాలు ఉండేవికావు. కంటోన్మెంట్​కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్​ సోమసుందరం మొదలియార్, బ్రిటిష్​ అధికారుల సాయంతో 1862లో ఆంగ్లో వెర్నాక్యులార్​ స్కూల్​ను సికింద్రాబాద్​లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరో నిజాం ప్రభువు మీర్​ మహబూబ్​ అలీఖాన్​ ఈ పాఠశాలకు తగిన నిధులు సమకూర్చడంతోపాటు ప్రతి ఏడాది పాఠశాల నిర్వహణకు గ్రాంటు మంజూరు చేసేవారు. దీంతో ఈ పాఠశాల పేరును నిజాం పేరిట మహబూబియా పాఠశాలగా మార్చారు.  

మహబూబియా కళాశాల 

ఆరో నిజాం ప్రభువు హైదరాబాద్​ నగర మహిళలకు బహుమతిగా మహబూబియా కళాశాలను స్థాపించారు.  సర్​ జార్జ్​ కాసన్​ వాకర్​, ఆయన భార్య కేన్సన్​ వాకర్​ల ప్రోత్సాహంతో నిజాం ప్రభువు ఈ కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. 1907 ఫిబ్రవరి 1న నాంపల్లి రైల్వేస్టేషన్​కు ఎదురుగా గల ఒక ప్రైవేట్​ భవనంలో మహబూబియా కళాశాలను ఆరో నిజాం పేరు మీదుగా ఏర్పాటు చేశారు. ఈ కళాశాల తొలి ప్రిన్సిపల్​గా ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జెఫ్రీని నియమించారు. 1930 నుంచి 1947 వరకు గ్రేస్​ లినెల్లీ ఆఖరి ఆంగ్లేయ ప్రిన్సిపల్​గా సేవలందించారు. 

నిజాం కాలేజ్​ 

1887లో చాదర్​ఘాట్​ స్కూల్​లోని ఇంటర్మీడియట్​ శాఖ, మదరసా–ఇ–ఆలియా అనే విద్యాసంస్థలను విలీనం చేసి నిజాం కళాశాలగా ఏర్పాటు చేశారు. 1872లో సాలార్​జంగ్​–1 కాలంలో తొలి ఇంగ్లిష్​ స్కూల్​గా హైదరాబాద్​ కాలేజీ స్థాపించారు. హైదరాబాద్​ కాలేజీ విద్యార్థులను మెట్రిక్యులేషన్​ పరీక్షకు తగిన శిక్షణ ఇచ్చి మద్రాస్ విశ్వవిద్యాలయానికి పంపేవారు. దీనిని 1877లో చాదర్​ఘాట్​ హైస్కూల్​గా పేరు మార్చారు. 1887 నుంచి 1947 వరకు కిండర్​ గార్డెన్​ స్థాయి నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్​ వరకు నిజాం కాలేజ్​ ఎందరికో విద్యా దానం చేసింది. 1914లో నిజాం కాలేజ్​ను ప్రస్తుత ఎల్​బీ స్టేడియం దగ్గరలోని భవనంలోకి మార్చారు.  

పైగా సమాధులు 

పైగా అంటే అత్యున్నత హోదా అని అర్థం. వీరు నిజాం ప్రభువుల కాలంలో  సైన్యాధ్యక్షులుగా, ప్రధాన ప్రభుత్వ సలహాదారులుగాను వ్యవహరించేవారు. ఓవైసీ హాస్పిటల్​ వెనుక భాగంలో పైగా సమాధులు నిర్మించారు. ఎనిమిది తరాలకు సంబంధించిన 32 మంది సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఇవి దక్షిణ తాజ్​మహల్​గా ప్రసిద్ధి చెందాయి. ఫతేఖాన్​ సమాధి పైన ఆస్ట్రిచ్​ పక్షి గుడ్డు ఆకారం వేలాడదీసి ఉన్నది. ఆస్మాన్​ అంటే ఆకాశమని అర్థం. అందుకే ఆయన సమాధిపైన ఏ విధమైన నిర్మాణం చేయలేదు. ఇతని సమాధికి ఉపయోగించిన పాలరాయి స్టోన్​ ఆఫ్​ సీజన్స్​గా పిలువబడుతుంది. బేగం ఖుర్షిదా సమాధి షాజహాన్​ సమాధిని పోలి ఉంటుంది. ఈ సమాధులు దక్కన్​ రాజస్థాన్​ శైలిలో నిర్మించారు. 

బేగంపేటలో పైగా ప్యాలెస్​

ఆరో నిజాం  మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ కాలంలో పైగా ప్రభువు వికార్​ ఉల్​ ఉమ్రా హైదరాబాద్​లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫలక్​నామా ప్యాలెస్​ నిర్మించాడు. ఫలక్​నామా ప్యాలెస్​ను వికార్​ ఉల్​ ఉమ్రా నుంచి 1897లో నిజాం ప్రభువు కొనుగోలు చేశాడు. ఉమ్రా తన కోసం బేగంపేటలో పైగా ప్యాలెస్​ నిర్మించుకున్నాడు. పైగా ప్యాలెస్​ను యూరోపియన్​ శైలిలో రెండంతస్తుల భవనంగా నిర్మించారు. కొంత కాలం పైగా ప్యాలెస్​లో అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హుడా) కార్యాలయాన్ని నిర్వహించారు.  

నగరంలో తొలి పోస్టాఫీసు

భాగ్యనగరంలో తొలి పోస్టాఫీసును 1866 మార్చి 14న బొల్లారంలో ఏర్పాటు చేశారు. నిజాం ప్రభువుల కాలంలో సికింద్రాబాద్​లో బ్రిటిష్​ వారు తమ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో బ్రిటిష్​ అధికారులు తమ సమాచార సౌకర్యార్థం బొల్లారంలో తొలి పోస్టాఫీసును నెలకొల్పారు. భాగ్యనగరంలో తొలిసారిగా టెలిగ్రాఫ్​ సౌకర్యం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. 

ఫలక్​నుమా ప్యాలెస్​ 

చార్మినార్​కు దక్షిణంగా 5 కి.మీ.ల దూరంలో 200 అడుగుల ఎత్తయిన కొండపైన 1893లో ఫలక్​నుమా ప్యాలెస్​ను నిర్మించారు. ఫలక్​నుమా అంటే ఆకాశ దర్పణమని అర్థం. పైగా ప్రభువులైన నవాబ్​ సర్​ వికార్​ ఉల్​ ఉమ్రా బహదూర్​ ఈ ప్యాలెస్​ను నిర్మించాడు. 1884, మార్చి 3న నిర్మాణ పనులను ప్రారంభించి 1893లో పూర్తి చేశారు. పైగా ప్రభువు జన్మరాశి వృశ్చికం కావడంతో ఆకాశం నుంచి చూస్తే తేలు ఆకారంలో రెండు కొండిలు, తోకతో ఉన్నట్లు ఈ ప్యాలెస్​ కనిపిస్తుంది. 1897లో ఈ ప్యాలెస్​ను పైగా ప్రభువుల నుంచి ఆరో నిజాం కొనుగోలు చేసి అదనపు నిర్మాణాలు, మరమ్మతులు చేయించాడు. ఈ ప్యాలెస్​లోనే ఆరో నిజాం 1911లో మరణించాడు. ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ కాలంలో యూరోపియన్​ రీతిలో మార్పులు చేసి రాయల్​ గెస్ట్​ హౌస్​గా ఉపయోగించారు. 

అసెంబ్లీ 

ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ భవన సముదాయం నిజాం ప్రభుత్వ హయంలో టౌన్​హాల్​గా ఉండేవి. ఈ భవన నిర్మాణాలను ఆరో నిజాం మహబూబ్​ అలీఖాన్​ చేపట్టాడు.  ఎనిమిది  సంవత్సరాల తర్వాత ఏడో నిజాం పనులను పూర్తిచేసి 1913లో ప్రజా సేవకు అంకితమిచ్చాడు. ప్రజా సమస్యలను చర్చించే సమావేశ మందిరంగా ఆనాడు  వినియోగించేవారు. ఆరో నిజాం 40వ జన్మదిన వేడుకల సందర్భంగా టౌన్​హాల్​ నిర్మాణం పనులు చేపట్టారు. అసెంబ్లీ భవనాన్ని ఇండో – ఇస్లామిక్​ శైలి, రాజస్తానీ– పర్షియ్​ మిశ్రమ ఆర్కిటెక్చర్​తో  నిర్మించారు. 

స్టేట్​ సెంట్రల్​ లైబ్రరీ

1891లో మౌల్వీ సయ్యద్​ హుస్సేన్​ బిల్​గ్రామి ఈ గ్రంథాలయాన్ని అబిడ్స్​లో ఒక చిన్న బంగ్లాలో స్థాపించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఈ గ్రంథాలయం అసఫ్​జాహీ పాలకుల గుర్తుగా అసఫీయా గ్రంథాలయంగా ప్రఖ్యాతి చెందింది. 1936లో  నవాబ్​ మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ చొరవతో గౌలిగూడలో ఇండో యూరోపియన్​ శైలిలో గ్రంథాలయం కోసం  భవన సముదాయం నిర్మించారు. భారతదేశంలో తెలంగాణ విలీనమైన తర్వాత దీని పేరును రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంగా మార్చారు.