
పద్మారావునగర్, వెలుగు: సెల్ ఫోన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య సోమవారం మీడియాకు వెల్లడించారు. చిలకలగూడకు చెందిన మదన రవితేజ అలియాస్ బన్నీ(21), బల్లనాగ చెన్నకేశవరావు(21) పలు నేరాలకు పాల్పడడంతో పోలీసులు రౌడ్షీట్ తెరిచారు. వీరు మెట్టుగూడకు చెందిన 15 ఏళ్ల బాలుడిని కలుపుకొని మొబైల్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు .
జూన్ 28న సాయంత్రం దుర్గారావు అనే క్యాబ్ డ్రైవర్ సికింద్రాబాద్ వద్ద వేచి ఉండగా బెదిరించి సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం చిలకలగూడ చౌరస్తాలో పట్టుకున్నారు. మూడు సెల్ ఫోన్లు, వాలెట్లు, స్మార్ట్ వాచీ, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్కు తరలించి బాలుడిని జువెనైల్ హోంకు పంపించారు. సమావేశంలో గోపాలపురం ఇన్స్పెక్టర్ మధు కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.