
కరీంనగర్, వెలుగు: మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఆర్ఎంపీలు, పీఎంపీలకు మద్దతుగా మాట్లాడిన నేపథ్యంలో హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్య కుమార్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు.
మెడికల్ లైసెన్స్ లేని, రిజిస్ట్రేషన్ లేని ఆర్ఎంపీలకు బహిరంగంగా మద్దతు తెలపడం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు అని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందిన వారం రోజుల్లో మెడికల్ కౌన్సిల్ చైర్మన్ లేదా రిజిస్ట్రార్కు వివరణ ఇవ్వాలని ఆదేశించారు.